టీఆర్ఎస్ భాగ్య‌న‌గ‌రాన్ని పాత‌బ‌స్తీగా మార్చాల‌ని చూస్తోంది

టీఆర్ఎస్ భాగ్య‌న‌గ‌రాన్ని పాత‌బ‌స్తీగా మార్చాల‌ని చూస్తోంది

హైదరాబాద్: బీజేపీ పాతబస్తీని భాగ్యనగరంగా మార్చాలని చూస్తుంటే టీఆర్ఎస్ మాత్రం భాగ్యనగరాన్ని పాతబస్తిగా మార్చాలని చూస్తుందని విమ‌ర్శించారు రాష్ట్ర‌ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. సోమ‌వారం మియాపూర్ నుంచి నాంపల్లి వరకు బండి సంజయ్ మెట్రో రైల్లో తొలిసారి ప్రయాణించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్ జాబితాలో టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఆక్రమణలకు పాల్పడింద‌ని, GHMC లో హిందువుల ఓట్లు తగ్గించి- ముస్లిం ల ఓట్ల సంఖ్య పెంచారన్నారు. మైనార్టీ ప్రాంతాల్లో హిందువుల ఓట్లు…, హిందువుల ప్రాంతాల్లో మైనార్టీ ఓట్లు చేర్చి ఆక్రమణకు పాల్పడ్డార‌ని ఆరోపించారు. హైదరాబాద్ లో 9వేల హిందువుల ఓట్లు గల్లంతయ్యాయని.. 30శాతం హిందువుల ఓట్లు తగ్గించి, ముస్లింల ఓట్లు పెంచారన్నారు సంజ‌య్.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ కరోన వైరస్ కంటే డేంజర్ అన్న సంజ‌య్.. టీఆర్ఎస్ నేతలు రోజుకో కొత్త వేషాలు వేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నార‌న్నారు, చిల్లర రాజకీయాలు, వేషాలు వేస్తున్నారన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి తలోంచి పనిచేస్తోందని, ఎన్నికల కమిషన్ పై ప్రజలకు నమ్మకం లేకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ ఏం చెబితే అది ఎన్నికల కమిషన్ చేస్తున్నట్లు ప్రజలు అనుకుంటున్నార‌ని, ఎన్నికల కమిషన్ చట్టానికి అతీతం కాదన్నారు. భాగ్యనగరాన్ని పాతబస్తీలా చేయాలని టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని చెప్పారు. బీజేపీకి అవకాశమిస్తే పాతబస్తీని హైటెక్‌సిటీగా మారుస్తామని వెల్లడించారు. చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకునే దమ్ము ప్రభుత్వానికుందా? అని సంజయ్‌ ప్రశ్నించారు.

ఇటీవ‌ల కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్ మునగలేదని, చెరువులు, నాళాల ఆక్రమణల వల్ల కాలనీలు మునిగాయన్నారు. చెరువులు, నాళాల ఆక్రమణల పై విచారణ చేస్తే టీఆరెస్ పార్టీ నేతలు సగానికి పైగా జైలుకు వెళ్తారన్నారు. ఎంఐఎం తో కలిసి సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో అంతర్గత సర్వే చేశార‌ని, బీజేపీ కి మంచి ఫలితాలు ఉన్నాయని తెలిసి ఎంఐఎం తో టీఆరెస్ కుట్ర చేస్తోందని దుయ్య‌బ‌ట్టారు. రాబోయే రోజుల్లో పాదయాత్రలు చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, డివిజన్ల వారిగా పాదయాత్ర ఉంటుంద‌ని సంజ‌య్ తెలిపారు.