ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి : బండి సంజయ్ కుమార్

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి : బండి సంజయ్ కుమార్
  •     ఎంపీ బండి సంజయ్ కుమార్

కరీంనగర్ సిటీ, వెలుగు :  రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్ లోని వైశ్య భవన్ లో  ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్ష, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యుల్లో ఎంతో మంది పేదలున్నారని, వారికోసం విద్యా, ఉద్యోగాల్లో ప్రధాని మోదీ 10 శాతం రిజర్వేషన్​ కల్పించారన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని, అయినా తనను ఓడగొట్టారని వాపోయారు.

హిందూ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు అహర్నిశలు కష్టపడుతున్నానని, హిందూ సమాజం కోసం పనిచేసే వాళ్లు ఆర్యవైశ్యులేననన్నారు. కార్యక్రమంలో నాయకులు కన్నకృష్ణ,  చిట్టిమల్ల శ్రీనివాస్ ,పెద్ది వేణు తదితరులు పాల్గొన్నారు. అనంతరం భారత మాజీ ప్రధాని అటల్​బిహారీ వాజ్‌‌పేయీ జయంతి సందర్భంగా సిటీలోని 59వ డివిజన్‌‌లో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు.

ఈసందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు అంబేద్కర్ స్టేడియంలో మార్వాడీ యువ మంచ్ ఆధర్యంలో జరుగుతున్న క్రికెట్ పోటీలను తిలకించారు. యువకులతో కలిసి కాసేపు క్రికెట్ ఆడి ఆటగాళ్లను ఉత్సాహపర్చారు.  విజేతలకు  బహుమతులు అందజేశారు.