- జైళ్లకు పోయేందుకు భయపడం: సంజయ్
కామారెడ్డి , వెలుగు: ‘‘తెలంగాణలో రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం రావాలి. ఇది బీజేపీతోనే సాధ్యం. ఇందుకోసం పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి” అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత మాల్యాద్రిరెడ్డి, పలువురు ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బాన్స్వాడలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘‘మేం ఏవరినీ రెచ్చగొట్టం. బీజేపీ రెచ్చగొట్టడం మొదలుపెడితే టీఆర్ ఎస్ కనుమరుగైతది. రాష్ట్రంలో ప్రెండ్లీ పోలీసింగ్ పోయింది. బీజేపీ వాళ్లను కొట్టుమని లాఠీలు ఇచ్చిన్రట. కేసీఆర్.. ఇప్పుడున్న లాఠీలు సరిపోవు. జైళ్లకు పోయేందుకు మేం భయపడం. ఎంతమందిని జైలుకు పంపుతవో చూస్తం. కొత్త జైళ్లు, లాఠీలకు ఈ బడ్జెట్లో ప్రత్యేక ఫండ్స్ పెట్టుకో. పోలీసులకు మేం వ్యతిరేకం కాదు. కానీ కొందరు పోలీసులు ప్రమోషన్ల కోసం రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నరు” అని అన్నారు.
బాన్స్వాడలో మాఫియా రాజ్యం
బాన్స్వాడలో మాఫియా రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. ఒకే నంబర్తో 10, 15 లారీల్లో అక్రమంగా ఇసుక తరలిస్తూ దోచుకుంటున్నారన్నారు. ఈ అక్రమాన్ని అడ్డుకుంటే లారీలతో గుద్దుతున్నారన్నారు. బాన్స్వాడలో ఓ పెద్దమనిషి ఉండని, ఆయనకు ఇద్దరు కొడుకులతో సన్స్ట్రోక్ ఉందన్నారు. ఆ పెద్దమనిషి కొడుకులు నియోజకవర్గాన్ని పంచుకొని రాజ్యమేలుతున్నరని విమర్శించారు. పోలీసు కాన్వాయ్ పెట్టుకొని తిరుగుతున్నారన్నారు. ‘‘మేం ఎంపీలం వస్తే కూడా సెక్యూరిటీ కోసం ఒక్క పోలీసు రాలేదు. కార్యకర్తలే మాకు రక్షణ’’ అన్నారు. చావుకు బండి సంజయ్ భయపడడని… చావే సంజయ్కు భయపడుతుందన్నారు. బాన్స్వాడలో బీజేపీ కార్యకర్తల జోలికొస్తే అర్ధరాత్రి అయినా వస్తానన్నారు.
గబ్బిలాల పీడ వదలాలి: ఎంపీ అర్వింద్
రూ.500 కోట్లు ఖర్చుచేసి సీఎం కేసీఆర్ పుట్టిన రోజు నాడు మొక్కలు నాటారని, ఒక వైపు ప్రకృతి వనరుల్ని కొల్లగొడుతూ మరో వైపు మొక్కలు నాటడం ఏమిటని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ చెప్పే బంగారు తెలంగాణ అంటే దోచుకొవడమేనని విమర్శించారు. ప్రతి స్కీమ్ పేరు అట్లనే ఉందన్నారు. యంత్రలక్ష్మీ స్కీమ్తో పోచారం ఇంట్లో పైసలు గలగలలాడాయన్నారు. వాళ్ల షోరూమ్లోనే ట్రాక్టర్లు కొనాలని సర్పంచులకు హుకూం జారీ చేశారన్నారు. లేదంటే చెక్ పవర్ రద్దు చేస్తామని బెదిరించారన్నారు. బాన్స్వాడకు పట్టిన గబ్బిలాల పీడ వదలాలన్నారు. బాన్స్వాడకు పోచారం గ్రహచారం పట్టిందన్నారు. ఈ గ్రహచారం పోయే రోజు దగ్గరలోనే ఉందన్నారు. మంజీర నుంచి ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఇసుక మాఫియానే వీఆర్ఏ సాయిలును తొక్కించి చంపిందన్నారు. సభలో యెండెల లక్ష్మీనారాయణ, పల్లె గంగారెడ్డి, అరుణతార, బస్వా లక్ష్మీనర్సయ్య, శ్రీశైలంగౌడ్, మురళీధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
