- బడ్జెట్లో కూడా 18 శాతం నిధులు కేటాయించాలి: మంత్రి వివేక్
- కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటది
- దళిత పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ రిలీజ్లో ఆలస్యం వద్దు
- కర్నాటక చట్టాలు తెలంగాణలో కూడా అవసరం
- రోస్టర్ విధానంతో మాలలకు అన్యాయం జరుగుతున్నదని వెల్లడి
నిజామాబాద్, వెలుగు: కర్నాటకలో ఎస్సీ వర్గీకరణకు ముందే రిజర్వేషన్ శాతాన్ని పెంచినట్లు తెలంగాణలో కూడా చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చేవేళ్ల డిక్లరేషన్ ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలని, బడ్జెట్లో ఎస్సీలకు 18 శాతం నిధులివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పార్టీ ప్రకటించినట్టు రిజర్వేషన్ పెంపు హామీ నిలబెట్టుకోవాలని దళితులంతా కోరుతున్నారని, కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని తెలిపారు.
ఆదివారం నిజామాబాద్ జిల్లాలో గెలిచిన మాల సామాజిక వర్గం సర్పంచ్, ఉపసర్పంచ్ల సన్మాన సభ మాలమహానాడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్మాట్లాడుతూ.. ఎస్సీలు స్థాపించిన ఇండస్ట్రీలకు సబ్సిడీ రిలీజ్ చేయడంలో ఆలస్యం చేయొద్దని అన్నారు.
సకాలంలో సబ్సిడీ రాకపోతే దళిత పారిశ్రామికవేత్తలు నిలదొక్కుకోవడం కష్టమని, సిక్ ఇండ్రస్టీలుగా మారితే కోలుకోలేరని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీలు స్థాపించిన పరిశ్రమల నుంచి కర్నాటక సర్కారు 4 శాతం ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నదని, దీన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని కోరారు. వర్గీకరణకు ముందే ఈ రెండు అంశాల్లో తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎస్సీలకు రూ.3 కోట్ల విలువ వరకు కాంట్రాక్టులు ఇవ్వాలని కోరారు. వారు ఆర్థికంగా ఎదిగితేనే కుల వివక్ష పోతుందని చెప్పారు.
పెద్దపల్లి జిల్లాకు కాకా పేరు పెట్టాలి: షబ్బీర్ అలీ
దేశానికి, ఉమ్మడి రాష్ట్రానికి.. ముఖ్యంగా తెలంగాణకు కాకా వెంకటస్వామి ఎంతో సేవ చేశారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అన్నారు. హైదరాబాద్లో కాకా వేయించిన గుడిసె స్థలాల విలువ ఇప్పుడు కోట్లకు చేరిందని చెప్పారు. పేదలు, కార్మికుల కోసం నిబద్ధతతో పనిచేసిన కాకా వెంకటస్వామి పేరును పెద్దపల్లి జిల్లాకు పెట్టాలని కోరారు. నిజామాబాద్ నగరంలో కాకా విగ్రహం ఏర్పాటు చేయాలని మంత్రి వివేక్కు విన్నవించారు.
ఎక్కడ విగ్రహం పెట్టినా ఆ చౌరస్తాను తాము డెవలప్ చేసి ఇస్తామన్నారు. బాధ్యతాయుతంగా పనిచేయడం వల్లే వివేక్ ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగారని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి అన్నారు. వివేక్, తాను నమ్మిన సిద్ధాంతాలతో రాజకీయాల్లో కొనసాగుతున్నట్టు చెప్పారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఎస్సీ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రెసిడెంట్ ఆలుక కిషన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, దండు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
రోస్టర్తో మాలలకు నష్టం
తన తండ్రి కాకా వెంకటస్వామి స్ఫూర్తితో ప్రజలకు సేవ, న్యాయం, మేలు చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని మంత్రి వివేక్ అన్నారు. జాతి ప్రయోజనాల కోసం కొట్లాడం మానుకో బోనని స్పష్టం చేశారు. రోస్టర్ విధానంతో మాలలకు సర్కారు కొలువుల్లో జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీలో మాట్లాడుదాం అనుకున్నానని, కానీ కేబినెట్లోనే చర్చించామని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి స్పందించి ఈ విషయంలో సమగ్ర రిపోర్టు అడిగారని తెలిపారు. రోస్టర్ అన్యాయంపై శాసనమండలిలో కూడా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు వివరించానన్నారు.
