కేసులు తగ్గడానికి కారణం టెస్టులు చేయకపోవడమే

కేసులు తగ్గడానికి కారణం టెస్టులు చేయకపోవడమే

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజయ్ బుధవారం భాద్యతలు స్వీకరించారు. హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం… అధికారికంగా ఛార్జ్ తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. “ఈ రోజు బీజేపీ పార్టీకి స్ఫూర్తిదాయకమైన‌ రోజు. నమ్మిన సిద్ధాంతం కోసం ఆత్మాభిమానం చేసిన సామా జగన్మోహన్ రెడ్డి మరణించింది ఈ రోజే. బీజేపీ కార్యకర్తల బలిదనాలను స్మరించుకుంటూ ఇవ్వాళ ఛార్జ్ తీసుకున్నా” అని తెలిపారు.

ప్ర‌ధాని మోడీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ప్రజలందరూ లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారన్నారు సంజ‌య్ . ప్రపంచ దేశాలు మోడీ ఐక్యతను స్ఫూర్తిగా తీసుకుంటున్నాయ‌ని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కరొనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు బీజేపీ సహకరిస్తోందని, భవిష్యత్ లోకూడా సహకరిస్తుంద‌ని అన్నారు. ఇదే విష‌యాన్ని లేఖ ద్వారా ప్రభుత్వానికి సహకరిస్తామని బీజేపీ తెలియజేసింద‌న్నారు. కరొనా నివారణకు సహకరిస్తున్న అధికారులకు-సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు సంజ‌య్. రాష్ట్రంలో కొరొనా కేసులు తగ్గడం సంతోషమే కానీ ప్రభుత్వ చర్యల పై అనుమానాలు వస్తున్నాయన్నారు.

కేసులు తగ్గడానికి కారణం టెస్టులు చేయకపోవడమేన‌ని ఆయ‌న అన్నారు. కేంద్రం ప్రతి రోజు 2వేల టెస్టులు చేసేందుకు అనుమతి ఇచ్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వం టెస్ట్ లు చేయడం లేదన్నారు. కేంద్రం-ICMR టెస్టులు పెంచమంది కానీ ఎక్కడా టెస్టులు తగ్గించమని చెప్పలేదన్నారు. పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలనే నిబంధనలు ఉన్నాయని, కరొనా రోగులకు సరైన వసతులు-సౌకర్యాలు లేకపోవడం వల్లే ధైర్యంగా ప్రజలు టెస్టుల కోసం ముందుకు రావడం లేదన్నారు సంజ‌య్.

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నడుపుతున్నారా? లేదా DME ( వైద్య విద్య డైరెక్టరేట్) అధికారి నడుపుతున్నారా? అని ప్ర‌శ్నించారు. చనిపోయిన మృతదేహాలకు కరొనా టెస్టులు చేయొద్దని DME ఎలా ప్రకటిస్తారు? అని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒక కరొనా రోగి మృతి చెందితే.. ఆయన వివరాలు అధికారిక లెక్కల్లో వెల్లడించలేదన్నారు ఎంపీ.

రంజాన్ కార‌ణంగానే కేసులు తగ్గించి టెస్టులు చేయట్లేద‌ని అన్నారు. ముస్లింల కోసం కేసీఆర్ కేసులు తగ్గిస్తున్నార‌న్నారు. ఒవైసీ తలొగ్గి కేసులు తగ్గించారని తెలిపారు. ముఖ్యమంత్రి కి సిగ్గు ఉంటే ఓల్డ్ సిటీలో ఎలా లాక్ డౌన్ అమలు అవుతుందో చూడాలన్నారు. ఇప్పటికే మర్కజ్ వల్ల దేశం అల్లకల్లోలం అయిందని, రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి చెంది-పాజిటివ్ కేసులు పెరిగితే ప్రభుత్వమే బాధ్య‌త వహించాలన్నారు. రంజాన్ మాసం మొదలు నుంచి లాక్ డౌన్ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వం రోజు విడుదల చేసే హెల్త్ బులిటెన్ లో అనేక తప్పులు ఉంటున్నాయని తెలిపారు.

ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ముకాసే విదంగా వ్యవహరిస్తోందని, ప్రతిపక్షాల సలహాలు-సూచనలు స్వీకరించే పరిస్థితిలో లేదన్నారు సంజ‌య్. ఓవైసీ మెప్పు కోసం కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. నికార్సైన హిందు ముఖ్యమంత్రి.. ఉగాది పండుగ , శ్రీ రామ నవమి ఎలా జరిగిందో మర్చిపోయారా? అని ప్ర‌శ్నించారు. హిందూ పండుగలు, జయంతులు, గొప్పవ్యక్తుల వర్ధంతులు చేసుకోలేద‌ని గుర్తు చేశారు. ప్రభుత్వం తీరు వల్ల సమాజంలో చీలిక రాబోతుందన్నారు సంజ‌య్.

MP bandi sanjay takes oath as bjp telangana president in state bjp office