పోలీసు అధికారులకు ఎంపీ అర్వింద్ వినతి
హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల 1 నుంచి 4 వరకు హైదరాబాద్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరుతూ... ఎంపీ ధర్మపురి అర్వింద్ బుధవారం పలువురు పోలీసు అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి, డీజీ సంజయ్ జైన్, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ లను విడివిడిగా కలిశారు. ప్రధాని, హోంమంత్రితో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు వస్తున్నందున తగిన సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ ప్రతినిధి బృందంలో బీజేపీ నేతలు మనోహర్ రెడ్డి, ఆంథోని రెడ్డి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఐదు రోజుల నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని, ఆయన నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదన్నారు. వారి సహకారాన్ని అభ్యర్థిస్తూ ఈ మెయిల్ కూడా పంపామని చెప్పారు.