హనుమకొండ, వెలుగు: క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించి, వారిని అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా తీర్చదిద్దడమే లక్ష్యంగా సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంపీ కడియం కావ్య తెలిపారు. సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు శుక్రవారం సాయంత్రం హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగనుండగా ఎంపీ కావ్య చీఫ్ గెస్ట్ గా హాజరై పోటీలను ప్రారంభించి మాట్లాడారు.
.జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు నిలయమైన ఓరుగల్లులో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని మెరుగైన క్రీడా సదుపాయాలు కల్పిస్తోందన్నారు. చిన్నారులను బాల్యం నుంచే క్రీడల వైపు మళ్లించేందుకు హనుమకొండలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం క్రీడలను నిర్లక్ష్యం చేసిందన్నారు.
హనుమకొండ కేంద్రంగా కోట్లాది రూపాయలతో క్రీడా పోటీల నిర్వహణకు సౌలతులు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 1,600 మంది క్రీడాకారులు హాజరైనట్లు డీవైఎస్ వో అశోక్ కుమార్ చెప్పారు. కలెక్టర్ స్నేహ శబరీశ్, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సారంగపాణి, అసోసియేషన్ జిల్లా చైర్మన్ గట్టు మహేశ్ బాబు పాల్గొన్నారు.
