దండం పెడుతున్నా.. వడ్లు కొనండి.. రైతులు ఆగమైతున్రు : ఎంపీ కోమటిరెడ్డి

దండం పెడుతున్నా.. వడ్లు కొనండి.. రైతులు ఆగమైతున్రు : ఎంపీ కోమటిరెడ్డి
  •  అకాల వర్షాలతో రైతులు ఆగమైతున్రు.. 
  •   ‘బీఆర్​ఎస్’​ కాకుంటే  ‘పీఆర్ఎస్’​ పెట్టుకోండి
  •   చేతగాని మంత్రులతో  ఎలాంటి ఉపయోగం లేదు.. 
  •   కేసీఆర్​ సర్కారుపై  ఎంపీ కోమటిరెడ్డి అసహనం 

యాదాద్రి, వెలుగు : ‘వడ్లు కొంటున్నామని మంత్రి గంగుల కమలాకర్​ చెప్పి 15 రోజులైనా కొనుగోళ్లు స్పీడ్ ​అందుకోలేదు. కేంద్రాల్లోని వడ్లు అకాల వర్షానికి ఆగమవుతున్నాయి. రైతుల తరపున కేసీఆర్​కు చేతులెత్తి దండం పెడుతున్నా.. బీఆర్​ఎస్​ కాకుంటే పీఆర్​ఎస్​ (ప్రపంచ రాష్ట్ర సమితి) పెట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదు. కానీ వడ్లను మాత్రం వెంటనే కొనండి’ అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ సర్కార్​లోని చేతగాని మంత్రులతో ఎలాంటి ఉపయోగం లేదని అసహనం వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా గుండాలలో జరిగిన కాంగ్రెస్​ ‘మాట ముచ్చట’ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్​  ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ. ఈ లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, రూ. 500 కే గ్యాస్​ సిలిండర్​ ఇస్తామని, క్వింటాల్​వడ్లను రూ. 3 వేలకు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. 

కాంగ్రెస్​ పాలిస్తున్న ఛత్తీస్​గఢ్​లో క్వింటాల్​ వడ్లను రూ. 3 వేలకు కొంటున్నామని తెలిపారు. ఇది తప్పని తేలితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, నిజమైతే మంత్రితో రాజీనామా చేయించాలని సవాల్​ విసిరారు. తెలంగాణలో అందరికీ దళితబంధు ఇవ్వడం చేతకాలేదు కానీ.. కేసీఆర్​ దేశవ్యాప్తంగా ఇస్తానంటున్నారని మండిపడ్డారు. గుండాల మండలంలో ఒక్క డబుల్​ బెడ్​ రూమ్ ​ఇల్లు కట్టలేదన్నారు. ఏం చేయకున్నా బీఆర్​ఎస్​ మాత్రం సమ్మేళనాలు చేసుకుంటోందని విమర్శించారు. వేల కోట్లు సంపాదించిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదారి కిశోర్, మంత్రి కనీసం ప్రజలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 

సీఎల్పీ లీడర్​ భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర యాదాద్రి జిల్లాలో అడుగు పెట్టిన తర్వాత ఆలేరులో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. అంతకుముందు ఆలేరు మండలం పటేల్​గూడెంలో అంబేద్కర్​ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ధాన్యం కొనుగోలు సెంటర్లను పరిశీలించారు. ఆయన వెంట టీపీసీసీ జనరల్​ సెక్రటరీ బీర్ల అయిలయ్య, జనగాం ఉపేందర్​రెడ్డి ఉన్నారు.