- ఒడిశా కోల్మైన్లో కేటీఆర్ అవినీతి
- ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
- బంధువు ద్వారా అదానీకి కోల్మైన్అప్పజెప్పే ప్రయత్నం
- రూ.40వేల కోట్ల గోల్మాల్
యాదాద్రి/బొమ్మల రామారం, వెలుగు : మంత్రి కేటీఆర్ రూ.40వేల కోట్ల అవినీతికి తెరలేపారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. ఒడిశాలోని కోల్మైన్ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయిస్తే.. కేటీఆర్ తన బంధువు అయిన ప్రతిమా శ్రీనివాస రావు ద్వారా అదానీకి అప్పగించే పనిలో ఉన్నారని విమర్శించారు. దీనిపై తాను కోర్టుకు వెళ్లానని తెలిపారు. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం రాంలింగంపల్లిలో జరిగిన పలు కార్యక్రమాల్లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని స్కూల్ను సందర్శించి టెక్ట్స్బుక్స్ రాలేవని తెలుసుకొని.. తాను ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ బీర్ల అయిలయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్లు చేస్తున్న అవినీతి, అక్రమాలన్నింటినీ బయటపెడ్తానని ప్రకటించారు. అదానీకి మోడీ సర్కార్ దోచిపెడుతోందని ఆరోపిస్తున్న కేటీఆర్.. ఆయన కూడా అదే చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణను రూ.5లక్షల కోట్ల అప్పుల పాల్జేసిన కేసీఆర్పై కేంద్రం ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ కొట్లాడుకుంటున్నట్టు యాక్షన్ చేస్తున్నాయని విమర్శించారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నామంటూ కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. నిరూపిస్తే.. తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. కేవలం ఎన్నికల కోసం దళితబంధు స్కీం తెచ్చారని విమర్శించారు. 4.80 లక్షల పాత పింఛన్లను పెండింగ్లో పెట్టారన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఏవని, ఎక్కడ కట్టారో చూపించాలని ఎద్దేవా చేశారు. ఖాళీ జాగా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తానని ఎన్నికల ముందు చెప్పిన కేటీఆర్, ఆ తర్వాత రూ.3 లక్షలకు మార్చారని ఆరోపించారు. చెప్పినట్టుగా ఆ రూ.3 లక్షలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.