
- రాహుల్ గాంధీని ప్రశ్నించిన ఎంపీ రఘునందన్రావు
హైదరాబాద్, వెలుగు: ఓట్ చోరీ అంటూ మాట్లాడుతున్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తను పోటీ చేసి గెలిచిన రాయ్బరేలీలో రాజీనామా చేసి, బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు దిగాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సవాల్ విసిరారు. రాజీనామా చేసేందుకు ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఓపిక ఉంటే.. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలన్నారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో రఘునందన్రావు మీడియాతో మాట్లాడారు. ‘‘రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులకు దేశంలోని వ్యవస్థలపై నమ్మకం లేదు.
1989లో ఓటమి తర్వాత బ్యాలెట్ పేపర్లు మంచివి కావని, ఈవీఎంలను తీసుకురావాలని నిర్ణయించింది రాజీవ్ గాంధీనే. తొలిసారిగా షాద్నగర్ నియోజకవర్గంలో ఈవీఎంలను పైలెట్ ప్రాజెక్ట్గా ఉపయోగించారు. కర్నాటక, తెలంగాణ, కేరళలో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఆ పార్టీ వాళ్లకు ఈవీఎంలు సరిగ్గా పనిచేసినట్లు అనిపించింది. కానీ, బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతదని తెలిసి ఈవీఎంలు తప్పు అని ప్రచారం చేస్తున్నరు” అని దుయ్యబట్టారు.