
ఇరిగేషన్, ఐటీ శాఖలు ఎందుకు వెనుకబడ్డాయో చెప్పాలి
ప్రభుత్వ శాఖలకు ర్యాంకులపై రేవంత్ కామెంట్స్
తండ్రీకొడుకులు అసమర్థులనడానికి ఇదే నిదర్శనమన్న కాంగ్రెస్ ఎంపీ
‘‘పొద్దునలేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పుకుంటున్నరు. ఐటీలో ఏవేవో అవార్డులొచ్చినయని ప్రకటనలు ఇస్తున్నరు. మరి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శాఖల ర్యాంకుల్లో మాత్రం సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ కిందికి జారిపోయారు. వాళ్లిద్దరూ అసమర్థులని, పని చేతగాదని నిర్వహించిన శాఖలే చెబుతున్నాయి”అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. 2018–19 ఏడాదికి ప్రభుత్వ శాఖల పనితీరుపై సీఎస్ ఎస్కే జోషి ఇటీవల విడుదల చేసిన ర్యాంకులపై స్పందించారు.
ప్రభుత్వంలో మొత్తం 34 శాఖలు ఉండగా, ప్రిన్సిపల్ సెక్రటరీల రిపోర్టుల ఆధారంగా 20 శాఖలకు ర్యాంకులు కేటాయించారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు ఫస్ట్ ర్యాంక్ దక్కగా, సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న ఇరిగేషన్కు ఎనిమిదో ర్యాంకు, విత్యుత్ శాఖ 11వ ర్యాంకు, గతంలో కేటీఆర్ నిర్వహించిన ఐటీ శాఖ 18వ ర్యాంకులో నిలిచాయి. తాము నిర్వహిస్తున్న శాఖల్ని గొప్పగా తీర్చిదిద్దామని కేసీఆర్, కేటీఆర్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని, వాళ్ల పనితీరుకు ర్యాంకులే నిదర్శనమని రేవంత్ అన్నారు. ఇకనైనా పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు.
అక్రమ సొమ్ముతో ప్రచారం.. అవార్డులు
అమెరికాలోని న్యూయార్క్లోనూ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రదర్శించామని సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకోవడం దారుణమని, అది కాళేశ్వరం కాంట్రాక్టర్ మెగా కంపెనీ ఇచ్చిన పెయిడ్ ప్రకటన అని, అక్కడ ఎవరైనా యాడ్స్ వేసుకోవచ్చని రేవంత్ తెలిపారు.
ఈటల నామ్కేవాస్తే
కాబట్టే పేరులేదు
సీఎస్ జోషి రిపోర్టులో ఈటల రాజేందర్ నిర్వహించిన ఆర్థిక శాఖ లేకపోవడంపై రేవంత్ ఘాటుగా స్పందించారు. ఈటలను కేసీఆర్ నామ్కేవాస్తేగా భావిస్తారు కాబట్టే, పాలసీ విధానంలో సీఎం అన్నీ తానై వ్యవహరిస్తారు కాబట్టే రిపోర్టులో ఈటల పేరు లేదని విమర్శించారు. బీసీ వెల్ఫేర్ శాఖ చివరి ర్యాంకులో ఉండటాన్ని బట్టి రాష్ట్రంలో బీసీ సంక్షేమం ఎలా అమలవుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు. తన అసమర్థకు సీఎం కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.