మైనారిటీ సంక్షేమ కమిటీలో ఎంపీ సంజయ్​

మైనారిటీ సంక్షేమ కమిటీలో ఎంపీ సంజయ్​

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ కమిటీలో ఎంపీలు బండి సంజయ్, రంజిత్ రెడ్డిలకు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ చోటు కల్పించింది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఆదేశాల మేరకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖకు లేఖ రాసింది. ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం పథకం కింద మోడీ సర్కారు ప్రవేశపెట్టిన 15 ప్రధాన కార్యక్రమాలు మైనార్టీలకు అందించే క్రమంలో ఎంపీలను అందులో భాగస్వాములను చేస్తున్నట్లు పేర్కొంది. ఇకపై జరిగే కమిటీ సమావేశాలకు ఈ ఎంపీలను ఆహ్వానించాలని, వారి విలువైన సూచనలు తీసుకుంటూ మైనారిటీలకు కేంద్ర ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మైనారిటీ సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన పథకాలను తెలంగాణలో పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని కమిటీ సభ్యుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పక్కదారి పడుతున్న మైనారిటీ సంక్షేమ పథకాలను అర్హులైన నిరుపేదలకు దక్కేలా కృషి చేస్తానని సంజయ్ తెలిపారు.