12 ఏళ్ల బాలికపై రేప్.. బాధితురాలిని ఆదుకోని స్థానికులు

12 ఏళ్ల బాలికపై రేప్.. బాధితురాలిని ఆదుకోని స్థానికులు

ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ ఇంటింటికీ తిరిగిన బాలిక
చిరిగిన బట్టలతో ఒంటిపై గాయాలతో బాలిక ఆవేదన

ఉజ్జయిని: మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. 12 ఏండ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు రేప్ చేశారు. ఆ బాలిక ఓ చిన్న క్లాత్ ను తన ఒంటిపై కప్పుకుని, రక్తస్రావంతో బాధపడుతూ ఇంటింటికీ తిరిగి స్థానికులను సాయం కోరింది. కానీ ఎవరూ స్పందించలేరు.  ఓ వ్యక్తి అయితే ఆమెను పొమ్మంటూ తరిమికొట్టాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన ఉజ్జయినికి దగ్గర్లోని బద్నాగర్ లో జరిగింది. బాలిక వీధుల్లో తిరుగుతూ సాయం కోరిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాయం కోరుతూ చివరికి ఓ ఆశ్రమానికి చేరుకున్న బాధితురాలిని అక్కడున్నోళ్లు చేరదీశారు. వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి బాలికపై రేప్ జరిగినట్టు డాక్టర్లు నిర్ధారించారు. బాధితురాలికి రక్తం ఎక్కువ పోవడంతో పరిస్థితి సీరియస్ గా మారింది. దీంతో ఆమెను ఇండోర్ లోని ఆస్పత్రికి తరలించి ట్రీట్​మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది.

కేసు దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు..

ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఉజ్జయిని ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేశామని చెప్పారు. ‘‘రేప్ జరిగినట్టు మెడికల్ టెస్టుల్లో తేలింది. కానీ రేప్ ఎక్కడ జరిగింది? ఎవరు చేశారు? అనేది ఇంకా తెలియలేదు. బాధితురాలి ఏమీ చెప్పలేకపోతోంది. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో కూడా సరిగా చెప్పలేకపోతున్నది. ఆమె మాట్లాడుతున్న యాసను బట్టి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు చెందిన బాలికగా భావిస్తున్నాం” అని వెల్లడించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అన్నారు.