- పంచాయతీ కార్యదర్శి నుంచి రూ.1.4 లక్షలు తీసుకుంటూ చిక్కిన ఆఫీసర్
స్టేషన్ఘన్పూర్ : ట్రాన్స్ఫర్ అయిన పంచాయతీ సెక్రెటరీకి ఎల్పీ సర్టిఫికెట్ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ ఎంపీడీఓ ఏసీబీకి చిక్కారు. అవినీతి నిరోధక శాఖ ఆఫీసర్ల కథనం ప్రకారం..స్టేషన్ఘన్పూర్ మండలంలోని శివునిపల్లిలో 2019 నుంచి 2022 వరకు వెంకటకిషోర్పంచాయతీ సెక్రెటరీగా పని చేశారు. ఈ ఏడాది జనవరిలో హన్మకొండ జిల్లా ఐనవోలుకు బదిలీ అయ్యారు. లాస్ట్ పే సర్టిఫికెట్(ఎల్పీసీ) కోసం ఎంపీడీఓ దేశగాని కుమారస్వామిని అడగ్గా ఆయన రూ.1.4 లక్షలు ఇస్తేనే పని అవుతుందని చెప్పాడు. ఉద్యోగం చేసేచోట సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో 7 నెలలుగా జీతం రావడం లేదు.
దీంతో వెంకటకిశోర్ వరంగల్లోని ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించాడు. వారి సూచనల ప్రకారం..సోమవారం హన్మకొండలోని సుమంగళి ఫంక్షన్హాల్ వద్దకు చేరుకున్న వెంకటకిశోర్ ఎంపీడీఓ కు ఫోన్ చేసి డబ్బులు తెచ్చానని చెప్పాడు. దీంతో ఎంపీడీఓ అక్కడికి వచ్చి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ హరీశ్కుమార్ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు శ్యాంసుందర్, శ్రీను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎంపీడీఓ సొంత ఊరైన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతలతో పాటు డ్యూటీ చేసే స్టేషన్ ఘన్పూర్ ఆఫీస్, హన్మకొండలోని ఇంట్లో మూడు బృందాలు తనిఖీలు చేశాయి. ఎంపీడీఓను హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు తరలించారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 9440446146 కు ఫోన్ చేసి చెప్పాలని, వారి వివరాలు సీక్రెట్గా ఉంచుతామని ఏసీబీ డీఎస్పీ హరీశ్కుమార్ తెలిపారు.