రాంచీ/రాజ్కోట్: జార్ఖండ్లో మొహర్రం ఊరేగింపు సన్నాహాల్లో కరెంట్ షాక్ తగిలి నలుగురు చనిపోయారు. మరో 10 మంది గాయపడ్డారు. ఈ ఘటన బొకారో జిల్లా ఖెత్కో గ్రామంలో శనివారం ఉదయం 6 గంటలకు జరిగిందని పోలీసులు వెల్లడించారు. స్థానిక యువకులు ఐరన్ రాడ్ ఉపయోగించి తయారు చేసిన తజియా(మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ సమాధి ప్రతిరూపం)ను ఊరేగించేందుకు రెడీ అయ్యారని పోలీసులు వెల్లడించారు. వర్షంలో తజియాను ఎత్తుకుని వెలుతుండగా దాని పైభాగం11 వేల వోల్టేజీల హై-టెన్షన్ ఎలక్ట్రిక్ వైర్కు తాకిందని తెలిపారు. దాంతో ఐరన్ రాడ్ పట్టుకుని ఉన్న నలుగురు యువకులు కరెంట్ షాక్తో చనిపోయారని.. మరో 10 మంది గాయపడ్డారని చెప్పారు. గాయపడిన వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. మొహర్రం ఊరేగింపులో జరిగిన ప్రమాదంపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ విచారం వ్యక్తంచేశారు.
గుజరాత్లో ఇద్దరు యువకులు..
గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలో జరిగిన మొహర్రం ఊరేగింపులోనూ షాక్ తగిలి ఇద్దరు చనిపోయారు. ధోరాజీ సిటీలోని రసూల్పారా ఏరియాలో తాజియా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో తాజియా పైభాగం 22 కేవీ ఓవర్ హెడ్ కరెంట్ వైర్కు తగిలింది. దాంతో ఇద్దరు చనిపోయారని.. మరో 22 మంది గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.