Mukesh Ambani: రూ.500 కోట్లు ఇన్వెస్ట్ చేసి రూ.9వేల కోట్లు పట్టిన అంబానీ.. ఏ స్టాక్ అంటే..?

Mukesh Ambani: రూ.500 కోట్లు ఇన్వెస్ట్ చేసి రూ.9వేల కోట్లు పట్టిన అంబానీ.. ఏ స్టాక్ అంటే..?

Ambani Investment: అందరూ అసాధ్యం అనుకునే ఫలితాలను తన వ్యాపార చతురత, వ్యూహాలతో సాధించే సత్తా ఉన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ. ఆయన ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు నిరూపించుకున్నారు. తండ్రి మరణం తర్వాత ఆయిల్ నుంచి ఫ్యాషన్ వరకు, టెలికాం నుంచి డిఫెన్స్ వరకు అనేక వ్యాపారాల్లోకి విస్తరించిన అంబానీ తన పెట్టుబడుల ద్వారా కూడా భారీ ఆదాయాలను పొందటం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు అంబానీ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు? ఎన్నాళ్ల కిందట పెట్టుబడి పెట్టారనే అనేక ప్రశ్నలకు సామాన్య పెట్టుబడిదారులు సమాధానాలు వెతుకుతున్నారు. 

ALSO READ | Trump Mobile: ట్రంప్ మెుబైల్స్ వచ్చేస్తున్నయ్.. నెట్ వర్క్, సిమ్ కూడా ఆయనదే.. స్పెషల్ సర్వీసెస్ కూడా ఉన్నాయ్..!

దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ తన పెట్టుబడిని ఇటీవల విక్రయించి క్యా్ష్ చేసుకున్నారు. దాదాపు 17 ఏళ్ల కిందట అంబానీ ప్రముఖ పెయింట్స్ కంపెనీ ఏషియన్ పెయింట్స్ సంస్థలో ఏకంగా రూ.500 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దానిని ఇప్పటి వరకు కొనసాగించటంతో ఏకంగా 2వేల 200 శాతం రాబడిని అందుకున్నారు. కంపెనీలో తనకు ఉన్న 87 లక్షల షేర్లను విక్రయించటంతో రిలయన్స్ అధినేత చేతికి రూ.9వేల 80 కోట్ల క్యాష్ రావటం ఇన్వెస్టర్లను షాక్ కి గురిచేసింది. 

అంబానీ తన వాటాలను ఒక్కో షేరుకు రూ.2వేల 207 రేటు చొప్పున సగటు రేటుకు విక్రయించారు. అయితే ఈ షేర్లను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. దీంతో అంబానీ బ్లాక్ డీల్ ద్వారా కంపెనీలో ఉన్న 4.9 శాతం వాటాలను విక్రయించారు. ప్రస్తుతం ఏషియన్ పెయింట్స్ కంపెనీ ప్రత్యర్థి సంస్థల నుంచి గట్టి పోటీని అందుకుంటున్న సమయంలో గడచిన రెండేళ్లుగా షేర్ ధర 30 శాతం పడిపోయింది. కంపెనీ స్టాక్ పనితీరు అధ్వానంగా ఉండటంతో అంబానీ పెయింట్ కంపెనీలో వాటాలను విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే 2008 మార్కెట్ల పతనం సమయంలో అంబానీ తక్కువ ధరల వద్ద ఏషియన్ పెయింట్స్ కంపెనీ షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. 

పెయింట్స్ వ్యాపారంలోకి ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ బిర్లా ఓపియస్ పెయింట్స్ పేరుతో ఎంట్రీ తర్వాత ఏషియన్ పెయింట్స్ మార్కెట్ వాటా కూడా తగ్గుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏషియన్ పెయింట్స్ మార్కెట్ వాటా 59 శాతం నుంచి 52 శాతానికి తగ్గవచ్చని ఎలారా సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. నగరాల్లో డిమాండ్ నెమ్మదించటం ఆదాయాల తగ్గుదలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉన్నట్లు వెల్లడైంది.