- అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ
ములుగు, వెలుగు : విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ సీహెచ్మహేందర్జీ సూచించారు. క్రీడలు మానసిక, శారీరక దృఢత్వానికి దోహదపడుతాయని స్పష్టం చేశారు. గురువారం ములుగు మండలం జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కాళేశ్వరం జోనల్ స్థాయి క్రీడలు ప్రారంభమయ్యాయి. ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీం–ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని 11 పాఠశాలలకు చెందిన 935 మంది క్రీడల్లో పాల్గొన్నారు. అండర్–14, 17, 19 విభాగాల్లో క్రీడలు నిర్వహిస్తున్నారు.
క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సూర్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, డీఈవో సిద్ధార్థరెడ్డి, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లుతో కలిసి క్రీడాజ్యోతిని వెలిగించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లడుతూ ప్రతిఒక్కరూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.
నియమనిబంధనలకు అనుగుణంగానే ఆడుకోవాలని, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని తెలిపారు. అనంతరం క్రీడాకారుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. కార్యక్రమంలో డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పల్లె జైపాల్ రెడ్డి, క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సూర్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, గురుకులాల పీడీలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
