
ములుగు, వెలుగు : సిక్ లీవ్ పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన టీచర్ను తిరిగి జాయిన్ చేసుకునేందుకు లంచం డిమాండ్ చేసిన ములుగు డీఈవో, సీనియర్ అసిస్టెంట్ను ఏసీబీ ఆఫీసర్లు సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం... కన్నయ్యగూడెం మండలం లక్ష్మీపురం స్కూల్లో పనిచేస్తున్న టీచర్ లావుడ్య హార్జీకి ఇటీవల యాక్సిండెట్ అవడంతో సిక్ లీవ్లో ఉన్నాడు.
లీవ్లు పూర్తి కావడంతో రీ పోస్టింగ్ కోసం ములుగు డీఈవో పాణిని కలిశాడు. పోస్టింగ్ ఇచ్చేందుకు రూ. 20 వేలు ఇవ్వాలని డీఈవో డిమాండ్ చేయడంతో సదరు టీచర్ ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించాడు. వారి సూచనతో సోమవారం ఆఫీస్కు వచ్చిన టీచర్.. డీఈవో పాణిని కి రూ. 20 వేలు, సీనియర్ అసిస్టెంట్ దిలీప్కు రూ. 5 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు డీఈవో, సీనియర్ అసిస్టెంట్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని, మంగళవారం ఉదయం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
రూ. 8 వేలతో దొరికిన విలేజ్ సెక్రటరీ
మునిపల్లి, వెలుగు : మెదక్ జిల్లా మునిపల్లి మండలం బుదేరా విలేజ్ సెక్రటరీ నాగలక్ష్మి లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి చిక్కింది. ఏసీబీ మెదక్ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం... కోహిర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి మునిపల్లి మండలం బుదేరా చౌరస్తాలో వాటర్ సర్వీసింగ్ సెంటర్, ఓపెన్ ప్లాట్కు ఇంటి నంబర్ కేటాయింపు కోసం బుదేరా విలేజ్ సెక్రటరీ నాగలక్ష్మిని కలిశాడు.
పని పూర్తి కావాలంటే రూ. 8 వేలు ఇవ్వాలని సెక్రటరీ డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించాడు. వారి సూచనతో సోమవారం సెక్రటరీని కలిసి డబ్బులు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు సెక్రటరీ నాగలక్ష్మిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.