- 9 మందికి స్వల్ప గాయాలు
తాడ్వాయి, వెలుగు: హనుమకొండ నుంచి తాడ్వాయి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, ఎస్సై జగదీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి హనుమకొండ నుంచి ఏటూరునాగారం వైపు వెళ్తున్న వరంగల్–1 డిపో ఆర్టీసీ బస్సు ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైంది.
మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఇసుక లారీలను తప్పించబోయే క్రమంలో వాహనాల లైట్లు నేరుగా పడటంతో బస్సు అదుపుతప్పింది. పక్కనే ఉన్న లోయ వైపు దూసుకెళ్లిన బస్సు అక్కడ అడ్డంగా పడివున్న భారీ చెట్టును ఢీకొట్టి ఆగింది.
దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎస్సై జగదీశ్ పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన ప్రయాణికులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో 28 మంది ప్రయాణికులు ఉండగా, 9 మందికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
