కేటీఆర్ వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్

కేటీఆర్ వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ నేతలే ఎలక్షన్ టూరిస్టులని, ఎన్నికలప్పుడే ప్రజల్లో తిరుగుతారంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీ డమ్మీ అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. డమ్మీలెవరో, డమ్మీ మంత్రులెవరో అందరికీ తెలుసున్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వంలో ఒక్క మంత్రికైనా స్వేచ్ఛ ఉందా..? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని రాహుల్ గాంధీ మాట్లాడితే.. స్క్రిప్టు అంటారా అంటూ మండిపడ్డారు. 

టీఆర్ఎస్, బీజేపీ పార్టీలవే డ్రామాలని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. రాహుల్ గాంధీ రాకను చూసి టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. రాహుల్ పర్యటనపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రశాంత్ కిశోర్ (పీకే) ఇచ్చిన రిపోర్ట్ తో టీఆర్ఎస్ నేతల్లో భయం మొదలైందన్నారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వదులుకుని, త్యాగం చేశారని చెప్పారు. ‘మీరు ముఖ్యమంత్రి కాకుండానే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారు’ అంటూ మంత్రి కేటీఆర్ పై సెటైర్లు వేశారు. ఆంధ్రా నాయకుల పాలనలో కూడా ఇప్పుడున్న పరిస్థితులు లేవన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటే అన్నారు. రాహుల్ గాంధీపై టీఆర్ఎస్ నాయకుల విమర్శలు హాస్యాస్పదం, అర్థరహితమన్నారు.