![నేపాల్ వైపు నుంచి ఎవరెస్ట్ పైకి.. అతిపిన్న వయస్కురాలిగా కామ్య రికార్డ్](https://static.v6velugu.com/uploads/2024/05/mumbai-girl-16-becomes-youngest-indian-to-scale-mount-everest-from-nepal-side_dUJO32ls6e.jpg)
న్యూఢిల్లీ: నేపాల్ వైపు నుంచి ఎవరెస్ట్ అధిరోహించిన ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలిగా నేవీ అధికారి కూతురు కామ్య కార్తికేయన్ రికార్డు సాధించింది. 16 ఏండ్ల కామ్య ముంబైలోని నేవీ చిల్డ్రన్ స్కూల్లో 12వ క్లాస్ చదువుతున్నది. ఆమె తండ్రి నేవీ కమాండర్ ఎస్ కార్తికేయన్తో కలిసి ఏప్రిల్ 3న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు కామ్య యాత్ర ప్రారంభించింది. ఈ నెల 20న నేపాల్ వైపు నుంచి ఎవరెస్ట్ శిఖరానికి చేరుకున్నది.
ఈ విషయాన్ని భారత నౌకాదళం గురువారం వెల్లడించింది. వెస్టర్న్ నేవల్ కమాండ్ కామ్య ఫొటోను జోడించి వివరాలను ట్వీట్ చేసింది. “ఎవరెస్ట్ను అధిరోహించిన రెండో అతి పిన్న వయస్కురాలు, నేపాల్ వైపు నుంచి ఎవరెస్ట్ ఎక్కిన అతి పిన్న వయస్కురాలిగా కామ్య రికార్డు సాధించింది” అని పేర్కొంది. అలాగే, ఆరు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించిన రికార్డును కూడా కామ్య సొంతం చేసుకున్నది.
వచ్చే డిసెంబర్ నెలలో అంటార్కిటికా ఖండంలోని మౌంట్ విన్సన్ మాసిఫ్ను ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కాగా, ఎవరెస్ట్ను అధిరోహించిన అతిపిన్న వయస్కురాలి రికార్డు తెలంగాణకు చెందిన మలావత్ పూర్ణ పేరుపైన ఉన్నది. ఆమె 13 ఏండ్ల వయసులోనే ఈ ఘనత సాధించింది.