- బాలీవుడ్ నటి కంగన కు ముంబై కోర్టు వార్నింగ్
ముంబయి: బాలీవుడ్ నటి కంగన రనౌత్ పై ముంబయి మెట్రోపాలిటన్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖ సినీ పాటల రచయిత, కవి జావేద్ అఖ్తర్ వేసిన కేసులో వ్యక్తిగతంగా హాజరు కాకుండా పదే పదే మినహాయింపు కోరుతుండడంపై కోర్టు అసహనం వ్యక్తం చేస్తూ ఇవాళ గట్టి వార్నింగ్ ఇచ్చింది. జావేద్ అఖ్తర్ వేసిన కేసు అంధేరి మెట్రోపాలిటన్ కోర్టులో ఇవాళ విచారణకు వచ్చింది. పిటిషనర్ జావేద్ అఖ్తర్ హాజరుకాగా నటి కంగన రనౌత్ మాత్రం హాజరుకాలేదు. తన లాయర్ ద్వారా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. పిటిషనర్ జావేద్ అఖ్తర్ అభ్యంతరం తెలుపడంతో న్యాయూమర్తి సైతం స్పందించారు.
నటి కంగన పదేపదే గైర్హాజరుకావడం.. హాజరు నుంచి మినహాయింపు కోరుతూ లాయర్ ద్వారా పిటిషన్ వేస్తుండడం చూస్తుంటే కాలయాపన చేస్తునన ధోరణి కనిపిస్తోందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాగే వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని.. వచ్చే విచారణకు తప్పకుండా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ వారెస్ట్ జారీ చేస్తానని న్యాయమూర్తి హెచ్చరించారు. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి కంగన తన పరువుకు నష్టం కల్గించే రీతిలో మాట్లాడారాని జావేద్ అఖ్తర్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. కంగన సర్దుబాటు చేసుకోకపోగా.. ఏకంగా ఈ కేసునే కొట్టివేయాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కేసు కొట్టేసేందుకు బాంబే హైకోర్టు ససేమిరా అనడంతో మెట్రోపాలిటన్ కోర్టులో కేసు విచారణ జరిగింది.