- కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ
- తమ శ్రేణులతో విప్ ఆది శ్రీనివాస్, కేంద్ర మంత్రి సంజయ్,
- ఎమ్మెల్యే కేటీఆర్ మంతనాలు
- గెలుపే లక్ష్యంగా వ్యూహాలు
- రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ
రాజన్నసిరిసిల్ల, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 1న మున్సిపల్ కార్యాలయాల్లో ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేశారు. అభ్యంతరాలుంటే తెలపాలని సూచించారు. ఈ నేపథ్యంలో కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల, ధార్మిక క్షేత్రమైన వేములవాడ బల్దియాల్లో రాజకీయం వేడెక్కింది.
ఎన్నికల వ్యూహాలపై చర్చలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీలపై పార్టీ జెండా ఎగురవేసేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీజేపీ తరఫున కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ తరఫున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్తమ పార్టీల శ్రేణులతో మంతనాలు జరుపుతున్నారు. గత డిసెంబర్ 31న కేటీఆర్ సిరిసిల్ల తెలంగాణ భవన్లో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల బీఆర్ఎస్ నాయకులతో సమావేశమై ఎన్నికలపై చర్చించారు.
సిరిసిల్ల పట్టణంలో పద్మశాలీ ఓట్లు ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వం వర్కర్ టు ఓనర్ స్కీంను అమలు చేయాలని, లేదంటే మహాధర్నా చేపడుతామని హెచ్చరించారు. మరోవైపు కేంద్ర మంత్రి సంజయ్ఈ నెల 1న సిరిసిల్ల శాంతినగర్ లోని ఓ బీజేపీ కార్యకర్త ఇంట్లో మీటింగ్ పెట్టారు. మున్సిపల్ ఎన్నికలపై మాట్లాడారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల, వేములవాడ బల్దియాలపై ఎలాగైనా కాంగ్రెస్జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో ముందుకుసాగుతున్నారు.
సిరిసిల్లలో 39, వేములవాడలో 29 వార్డులు
మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. సిరిసిల్లలో 39, వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులున్నాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లో గత టర్మ్ చైర్మన్ సీటు మహిళలకే దక్కింది. ఈసారి ఏ రిజర్వేషన్ వస్తుందోననే ఉత్కంఠ ఆశావాహుల్లో నెలకొంది. ప్రస్తుతం మహిళ, జనరల్ రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాల కేటాయింపులో రొటేషన్ పద్ధతి అమలు చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో అన్ రిజర్వ్డ్ స్థానాల్లో సైతం బీసీ, ఎస్సీ, ఎస్టీలు గెలిచారు. ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసిరాకపోతే జనరల్ స్థానాల్లో పోటీ చేసేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ లీడర్లు సమాయత్తం అవుతున్నారు.
