- ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్: ఉత్తమ్
- సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక
- పైరవీలు నడ్వవన్న మంత్రి
నిజామాబాద్, వెలుగు: రెండు మూడ్రోజుల్లో మున్సిపల్ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్, బోధన్ మున్సిపాలిటీల పరిధిలోని కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల మీటింగ్ నిజామాబాద్లో నిర్వహించారు. ఆర్మూర్, భీంగల్కార్యకర్తల మీటింగ్ ఆర్మూర్లో నిర్వహించారు. ఈ రెండు సమావేశాల్లో ఉత్తమ్ మాట్లాడారు. ‘‘మున్సిపాలిటీల్లో టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది. సర్వేలు, ప్రజల అభిప్రాయాల ఆధారంగా అభ్యర్థులను నిర్ణయిస్తాం. నిజామాబాద్ కార్పొరేషన్పరిధిలో మస్తాన్ సర్వే చేస్తారు.
ఆయనకు ఇన్పుట్స్ఇవ్వండి. టికెట్ల కోసం ఎవరూ పైరవీలు చేయనక్కర్లేదు. కచ్చితంగా గెలిచేవాళ్లనే నిలబెడతాం. ఎవరికి అవకాశం వచ్చినా అందరూ కలిసి గెలిపించాలి. టికెట్రాని వారికి ఇతర నామినేట్ పదవులు ఇచ్చి న్యాయం చేస్తాం. కష్టపడే కార్యకర్తలను గుర్తించి గౌరవించేది కేవలం కాంగ్రెస్మాత్రమే” అని అన్నారు. మూడు వార్డులకొక బాధ్యుడిని నియమించాలని, ప్రచార బాధ్యత వారికి అప్పగించాలని డీసీసీ నేతలకు సూచించారు. ప్రతి ఓటును కీలకంగా భావించాలని, పోల్మేనేజ్మెంట్కోసం నిపుణులను నియమిస్తామని చెప్పారు.
సమర్థులకే టికెట్: పీసీసీ చీఫ్
కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందడం బీజేపీకి అలవాటైందని పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ మండిపడ్డారు. ‘‘మేం హిందువుగా దేవుళ్లను పూజిస్తాం. కానీ దేవుడి పేరుతో ఓట్లు అడగం. అది కాంగ్రెస్ విధానం కాదు. మత రాజకీయాలు ప్రజలకు బువ్వపెట్టవు. కేవలం మతాన్ని అడ్డుపెట్టుకొని నిజామాబాద్ ఎంపీగా అర్వింద్ గెలిచారు. కరీంనగర్ కంటే పాతదైన నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా ఎందుకు చేయలేదో ఆయన చెప్పాలి” అని ప్రశ్నించారు.
మున్సిపల్ఎన్నికల్లో టికెట్ల కోసం పైరవీలు చేయొద్దని, సమర్థులైతే గుమ్మం దగ్గరికే బీఫామ్ వస్తుందని స్పష్టం చేశారు. కొన్నిసార్లు అందరికీ న్యాయం చేయలేమని, ఓపికతో ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే టికెట్ రాకున్నా ఓపికతో ఉన్నందుకే, తాను పీసీసీ ప్రెసిడెంట్ అయ్యానని పేర్కొన్నారు.
