రేవంత్ ను సీఎం చేయడానికి మేము కష్టపడాల్నా

రేవంత్ ను సీఎం చేయడానికి మేము కష్టపడాల్నా

ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామితో కలిసి అమిత్ షాను ఆయన కలిశారు. తనతోపాటు బీజేపీలో చాలామంది చేరుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉపఎన్నిక వస్తేనే నిధులు వచ్చే పరిస్థితి ఉందని..కేసీఆర్ కు కనువిప్పు కలిగేలా మునుగోడు తీర్పు ఉంటుందన్నారు. అభివృద్దికి అధికార పార్టీ సహకరించడం లేదన్న ఆయన..అభివృద్ధి సిద్ధిపేట, సిరిసిల్లలకే పరిమితమైందని ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నిక తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తెస్తుందని..మునుగోడు ప్రజలు ధర్మం వైపు ఉంటారన్న నమ్మకం తనకు ఉందన్నారు. 

త్వరలోనే వెంకట్ రెడ్డి మంచి నిర్ణయం

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇవాళ్టి మీటింగ్ కు కూడా ఆయన వెళ్లలేదన్నారు. చెరుకు సుధాకర్ చేరిక పట్ల వెంకట్ రెడ్డి అసతృప్తితో ఉన్నట్లు చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు తగిన గుర్తింపు లేదని..తమకు పదవులు ముఖ్యం కాదని..ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధానమన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పేరు ప్రతిష్ఠలను చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. 

తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. బయటనుంచి వచ్చిన వ్యక్తికి పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టారని..ఆయనను ముఖ్యమంత్రి చేయడానికి మేము కష్టపడాలా అని ప్రశ్నించారు. తాను బీజేపీకి అమ్ముడుపోయినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి తన సవాల్ స్వీకరించాలని చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తిట్టడం రేవంత్ రెడ్డి జీవితంలో చేసిన పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి క్యారెక్టర్, క్రెడిబులిటి లేదన్నారు.