
- 9 నెలలుగా ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు లేవని ఫైర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్ఆఫీస్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో టౌన్ ప్లానింగ్ అధికారులపై ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ భర్త నవీన్ గౌడ్ ఫైరయ్యారు. ముషీరాబాద్ డివిజన్లో అక్రమ అనుమతులపై 9 నెలలుగా ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోకపోవడంపై సిటీ చీఫ్ ప్లానర్ శ్రీనివాస్ను నిలదీశారు.
2010లో ప్రపోజల్ ఉన్న 60 ఫీట్ల రోడ్డులో అక్రమ అనుమతులపై కూడా చర్యలు లేవని ఆరోపించారు. సోమవారం ప్రజావాణిలో మొత్తం 60 ఫిర్యాదులు అందగా, టౌన్ ప్లానింగ్కు 27, ట్యాక్స్కు 5, ఇంజినీరింగ్కు 11, యూబీడీకి 3, వెటర్నరీకి 1, ఎస్టేట్కు 2, ఫైనాన్స్కు 4, అర్బన్ కమ్యూనిటీ అభివృద్ధి, లీగల్, రవాణా, భూ సేకరణకు ఒకటి చొప్పున, ఫోన్ ఇన్ ద్వారా 3 ఫిర్యాదులు వచ్చాయి. అలాగే బల్దియా పరిధిలోని ఆరు జోన్లలో 88 ఫిర్యాదులు అందగా, కూకట్పల్లిలో 39, సికింద్రాబాద్లో 27, శేరిలింగంపల్లిలో 6, ఎల్బీనగర్లో 8, చార్మినార్లో 7, ఖైరతాబాద్లో ఒక ఫిర్యాదు నమోదైంది.
కలెక్టరేట్లో 292
హైదరాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ హరిచందన ఫిర్యాదులను స్వీకరించారు. దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం గత వారం ప్రవేశపెట్టిన వాట్సాప్ నంబరు ద్వారా వచ్చే ఫిర్యాదులకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 251 ఫిర్యాదుల్లో హౌసింగ్ శాఖకు 151 (డబుల్ ఇండ్ల కోసం 25, ఇందిరమ్మ ఇండ్లు 126), పెన్షన్స్ 33, కలెక్టరేట్ సెక్షన్లు 23, ఆర్డీఓ, తహసీల్దార్ 8, ఇతర శాఖలకు 36 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే వాట్సాప్ కు 41 ఫిర్యాదులు వచ్చాయి. సోమవారమే కాకుండా వాట్సాప్కు రెగ్యులర్ గా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ జిల్లాకు సంబంధించినవే అధికారులు స్వీకరిస్తున్నారు.
హైడ్రాకు 58 ఫిర్యాదులు
హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 58 ఫిర్యాదులు అందాయి. అత్యధికంగా పార్కుల కబ్జాలు, రహదారుల ఆక్రమణలకు సంబంధించినవి ఉన్నాయి. ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. గూగుల్ మ్యాప్స్, లేఅవుట్లతో పాటు ఎన్ఆర్ఎస్సీ, సర్వే ఆఫ్ ఇండియా, గ్రామ రికార్డులను ఆన్లైన్లో చూసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.