- హరిత ప్లాజాకు వెళ్లిన జనగామ లీడర్లు
- టికెట్ ఎవరికిచ్చినా గెలిపిస్తామని ప్రకటన
జనగామ, వెలుగు : ‘ప్రగతి భవన్నుంచి ఫోన్ వచ్చింది. మండలానికి ఇద్దరు ముఖ్య లీడర్లకు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు చెప్పిన్రు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత హుటాహుటిన వెళ్లినం. అర్జంట్ పని ఉండి కేసీఆర్ కలువలేదు. మంత్రి హరీశ్ రావు మాట్లాడిండు. ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా కలిసికట్టుగా పనిచేసి గెలిపించాలె అన్నడు’ అని హైదరాబాద్ హరిత ప్లాజాకు వెళ్లిన లీడర్లు చెప్పారు. మూడు రోజుల కింద జనగామ బీఆర్ఎస్ టికెట్ పంచాయితీకి హైదరాబాద్ హరిత ప్లాజా వేదికైన విషయం తెలిసిందే. దీంతో హరిత ప్లాజాకు వెళ్లిన లీడర్లపై ముత్తిరెడ్డి వర్గీయులు తీవ్రస్థాయిలో భగ్గుమంటున్న నేపథ్యంలో వారు ఓపెన్ అవుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తమను ఎవరూ శంకించవద్దని అంటూనే ప్రగతి భవన్ కేంద్రంగా అభ్యర్థిత్వం మార్పు అంశంపై పావులు కదులుతున్నట్లు చెప్పేశారు. ఎవరికి పార్టీ టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని అంటున్నారు.
సఖ్యత లేమితో లొల్లి..
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మంత్రి హరీశ్ రావుకు మధ్య సఖ్యత లేదనేది ఓపెన్ సీక్రెట్. పైకి ఇద్దరు కలిసి ఉన్నట్లు కనిపించినా లోలోపల అభిప్రాయ భేదాలు బయటపడిన సందర్భాలున్నాయి. పైగా జనగామ నియోజకవర్గంలో చేర్యాల, కొమురవెళ్లి, మద్దూరు, దూళ్మిట్ట మండలాలు సిద్దిపేట జిల్లా పరిధిలోకి వెళ్లాయి. దీంతో సదరు మండలాల్లో మంత్రి హరీశ్ వర్గం, ముత్తిరెడ్డి వర్గాలుగా బీఆర్ఎస్ లీడర్లు విడిపోయారు. ఇద్దరు లీడర్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నది. నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే నిర్ణయాలే ఫైనల్ అని సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి అన్న పరిస్థితులు సదరు మండలాల్లో ఉండేవి. ఈ క్రమంలో తాజాగా హరిత ప్లాజా ఘటనలో సదరు లీడర్లతో హరీశ్ రావు మాట్లాడడంపై ముత్తిరెడ్డి వర్గం గుర్రుగా ఉంది. ఊహించని రీతిలో తెరపైకి పల్లా రావడంతో ముత్తిరెడ్డికి టెన్షన్ తప్పడం లేదు. ఇదే క్రమంలో సీఎం కేసీఆర్తో తనకు ఉన్న సాన్నిహిత్యంతో ఎలాగైనా మూడో సారి టికెట్ తెచ్చుకుని గెలువాలనే పట్టుదలతో ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనెల 21న లిస్ట్ బయటకు రానుందని పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అపార్థం చేసుకున్నరు..
బచ్చన్నపేట: తమను అధిష్ఠానం(మంత్రి హరీశ్ రావు) రమ్మని పిలిస్తేనే ప్రగతి భవన్కు వెళ్లామని రైతుబంధు జిల్లా కన్వీనర్ ఇర్రి రమణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోడిగం చంద్రారెడ్డి తెలిపారు.పల్లా వర్గంగా భావిస్తున్న రైతుబంధు జనగామ జిల్లా కన్వీనర్ రమణారెడ్డి బచ్చన్నపేటలోని ఓ ఫంక్షన్హాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రగతి భవన్ కు వెళ్లిన విషయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డితోపాటు మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తమను అపార్థం చేసుకున్నారన్నారు. అధిష్ఠానం జనగామ టికెట్ ఎవరికి ఇచ్చినా మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు.