
- రైతుల్ని ఆదుకుంటామని హామీ
రామాయంపేట, వెలుగు: రామాయంపేట మండలం రాయిలాపూర్ లో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను సోమవారం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పరిశీలించారు. ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు రాయిలాపూర్, కోనాపూర్, సుతారిపల్లి గ్రామాల్లో సుమారు 162 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. ఈ విషయం తెలుసుకున్న ఆయన గ్రామానికి చేరుకుని వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడి ప్రభుత్వ పరంగా తగిన పరిహారం ఇప్పిస్తానని, అలాగే తన వంతు కొంత సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నాయకులు చౌదరి సుప్రభాతరావు, రమేశ్ రెడ్డి, సరాఫ్ యాదగిరి, దేమే యాదగిరి ఉన్నారు.
భూభారతితో రైతుల సమస్యలు పరిష్కారం
శివ్వంపేట: భూభారతి చట్టంతో రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శివ్వంపేటలో కాంగ్రెస్ నాయకుడు కొడకంచి శ్రీనివాస్ గౌడ్ ఏర్పాటు చేసిన బైకు ర్యాలీలో పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ నివాసంలో హన్మంతరావు మాట్లాడుతూ.. భూసమస్యలు ఎక్కువగా ఉన్న ఈ మండలంలో అన్ని పరిష్కారమవుతాయన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కబ్జాలు జరిగాయని, కొంతమంది ఆఫీసర్లు వారికి సహకరించారన్నారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ, ఫారెస్ట్, దేవాదాయ భూములు పట్టాగా మార్చి విక్రయించారని ఆరోపించారు. వీటన్నిటికి గతంలో ఉన్న తహసీల్దార్, బీఆర్ఎస్ నాయకులు బాధ్యులన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, భాస్కర్ రెడ్డి, శంకర్ గౌడ్, నాని, వెంకటేశ్, నర్సింలు, గణేశ్ గౌడ్ పాల్గొన్నారు.