ఇంటర్ విద్యార్థిని రాధిక హత్యకేసులో వీడిన మిస్టరీ… కన్నతండ్రే హంతకుడు

ఇంటర్ విద్యార్థిని రాధిక హత్యకేసులో వీడిన మిస్టరీ… కన్నతండ్రే హంతకుడు
  • అనారోగ్యంతో పడుకున్న బిడ్డ పై విచక్షణ రహితంగా దాడి
  • దిండుతో నొక్కి చంపి…ఆపై గొంతు కోసి…
  • చావుతో కొట్టుకుంటున్న కరగని కన్నప్రేగు
  • బంగారం,డబ్బు కోసమే హత్యగా చిత్రీకరణ
  • ఖర్చులు భరించలేక కన్నతండ్రి కర్కశత్వం
  • సంచలనం సృష్టించిన రాధిక హత్య కేసులో కీలక మలుపు
  • ప్రతిష్టాత్మక జర్మన్ టెక్నాలజీ వినియోగం

కరీంనగర్ లో సంచలనం సృష్టించిన  ఇంటర్ విద్యార్థిని రాధిక హత్యకేసు మిస్టరీని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేధించారు పోలీసులు. అనారోగ్యంతో ఉన్న బిడ్డకు ఖర్చులు పెట్టలేక కన్నతండ్రే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని, 19 సంవత్సరాల తన కూతురును గొంతుకోసి అతి దారుణంగా చంపారని పోలీసులు తెలిపారు.

కరీంనగర్ పట్టణం విద్యానగర్ చెందిన ముత్త కొంరయ్య గోదాంగడ్డ లోని గోడౌన్ లో హమాలి పని చేస్తుండే వాడు. గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యం,పోలియోతో బాధపడుతున్న తన కూతురు ముత్త రాధికను చికిత్స నిమిత్తం అనేక హాస్పిటల్స్  తిరిగి చికిత్స చేయించాడు. చికిత్స కోసం దాదాపు 6 లక్షల రూపాయల వరకు ఖర్చుపెట్టగా.. ఆరోగ్యం బాగుపడడంతో  ఒక సంవత్సరం క్రితం కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ కాలేజిలో రాధికను  ఇంటర్ మొదటి సంవత్సరం లో చేర్పించాడు. గత కొద్ది రోజుల నుండి రాధిక మళ్ళీ అనారోగ్యంతో బాధపడుతుండడంతో, మళ్ళీ డబ్బులు ఖర్చుపెట్టి నయం చేయించే స్థోమత లేక  కొంరయ్య విసుగు చెంది.. ఎలాగైనా తన బిడ్డను చంపాలని నిర్ణయించుకొని పక్కా ప్లాన్ వేశాడు.

ప్లాన్ ప్రకారం.. తమ ఇంట్లో కిరాయికి ఉంటున్న పోచయ్య కుటుంబాన్ని బలవంతంగా  ఫిబ్రవరి 6 న(06.02.2020) ఖాళీ చేయించాడు. ఫిబ్రవరి 10 న ఎలాగైనా రాధిక ను చంపాలని నిర్ణయించుకొని, తన భార్యని కూలి పనికి పంపించి, బయట పరిస్థితులు గమనించడానికి కిరాణం షాప్ కి ఉప్పు కొనడానికి వెళ్లినట్లు వెళ్లి ఎవరూ లేని నిర్ధారించుకొని తిరిగి ఇంటికి చేరుకున్నాడు.

ఇంటికి వచ్చిన కొంరయ్య తన బిడ్డ రాధిక బెడ్ పై దుప్పటి కప్పుకొని పడుకోవడం చూసి,అదే అదునుగా భావించి గుట్టు చప్పుడు కాకుండా వెళ్లి ,  బరువైన దిండును తీసి రాధిక ముఖంపై అదిమిపెట్టి  ఊపిరి ఆడకుండా చేసి చంపాడు. తర్వాత పోలీసులకు అనుమానం రాకుండా రాధిక మృతదేహాన్ని బెడ్ పై నుండి కింద పడేసి, కిచెన్ లో గల కత్తి తీసుకువచ్చి, విచక్షణ రహితంగా ఆమె మెడని కోశాడు.  రక్తపు మరకలు అంటిన కత్తిని కడిగాడు. బనియన్ ను ఉతికి మేడపై ఆరేసి, తిరిగి ఇంట్లోకి వచ్చి తాపీగా భోజనం చేసి ఆ తర్వాత  గోదాం కి సైకిల్ పై వెళ్లాడు. వెళ్లే ముందు ఇంట్లోని సెల్ఫ్ లో గల తన భార్య చైన్ ని  బియ్యం బస్తాలో  కనపడకుండా దాచిపెట్టాడు. పని వద్దకు వెళ్ళాక ఎవరికి అనుమానం రాకుండా తన భార్యకు, ఇతరులకు ఫోన్ చేసి మాట్లాడి, ఆ తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొన్నాడు. యథా ప్రకారం తన రోజువారీ హమాలి పని చేశాడు.

అదే రోజు సాయంత్రం చుట్టుపక్కల వాళ్ళు .. రాధిక హత్య చేయబడిందని తెలుసుకొని, కొంరయ్య కొడుకు వేణుకి ఫోన్ చేసి చెప్పారు. వేణు తండ్రికి ఫోన్ చేయగా కలవకపోవడంతో అతని పాటు పనిచేస్తున్న వాళ్ళకి ఫోన్ చేసి రాధిక హత్య గురించి చెప్పాడు. హత్య గురించి తెలిసిన కొంరయ్య ఏమీ  తెలియని వాడిగా ఏడుపు నటిస్తూ ఇంటికి వెళ్లి, అందరి సానుభూతి పొందే ప్రయత్నం చేశాడు. పోలీసులు వచ్చి ఏమైనా డబ్బులు, బంగారం పోయిందా అని అడగ్గా,ఇంట్లో ఉన్న 3 తులాల బంగారు ఆభరణాలు మరియు 99000/- రూపాయల( బీరువాలో గల 50,000/- మరియు ప్యాంట్ జేబులో గల 49,000/-) నగదును  ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి,తన బిడ్డను చంపి ఎత్తుకెళ్లారని కొత్త నాటకానికి తెరలేపాడు.

కరీంనగర్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ హత్యకేసును ఎలాగైనా ఛేదించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి ప్రత్యేక టీమ్ లను  ఏర్పాటు చేశారు. ఆయన ఆధ్వర్యంలోని పోలీస్ సిబ్బంది 8 బృందాలుగా ఏర్పడి హత్యకేసును చేధించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో పాటు సిసి కెమెరాలు,పాత నేరస్తుల కదలికలు, సైబర్ ఫోరెన్సిక్ టెక్నిక్స్, వీడియో ఎన్హన్స్మెంట్ టెక్నాలజీ, జర్మన్ టెక్నాలజీ ని ఉపయోగించి నేరం చేసింది రాధిక తండ్రి కొమరయ్య నే అని నిర్దారించుకొని అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసులు తమదైన శైలిలో అడగ్గా చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు.