- ముగ్గురూ ఒక్కటై మాకు పదవులు రాకుండా అడ్డుకున్నరు: ఎన్.రాంచందర్రావు
- అయినా కరీంనగర్, భైంసా, నారాయణపేటలో కాషాయ జెండా ఎగరేశాం
- ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్నం
- హైదరాబాద్లో దొంగ ఓట్ల ఏరివేతకు త్వరలో ‘సర్’చేపడ్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనాన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటయ్యాయని, తమ పార్టీని ఓడించేందుకు ఆ మూడు పార్టీలు చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి మెజారిటీ వచ్చిన చోట కూడా పదవులు దక్కకుండా ఇండిపెండెంట్లను సైతం కలుపుకొని కుట్రలు చేశారని ఆరోపించారు. ఈ మూడు పార్టీల కలయికను ‘అక్రమ సంబంధం’అనాలా... అని ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రంలో బీజేపీ బలం పెరిగిందని, కరీంనగర్ కార్పొరేషన్తో పాటు నారాయణపేట, భైంసా మున్సిపాలిటీలపై కాషాయ జెండా ఎగురవేశామన్నారు.
సోమవారం పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ బీజేపీకి మేయర్ పదవి దక్కలేదు. కానీ తొలిసారిగా కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నాం. బండి సంజయ్ కృషి, కార్యకర్తల పట్టుదలతో ఇది సాధ్యమైంది’’అని అన్నారు. భైంసాలో గెలుపు తమకెంతో సంతోషాన్నిచ్చిందని, అక్కడ ఎంఐఎం నేతలు, గత ప్రభుత్వాలు బీజేపీ కార్యకర్తలను తీవ్రంగా వేధించాయని గుర్తుచేశారు. భైంసాలో కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి, జైళ్లకు పంపారని, లాయర్గా నేను చాలా మందిని విడిపించానన్నారు. ప్రస్తుతం అదే భైంసాలో బీజేపీ జెండా ఎగరడం సంచలనమన్నారు.
హస్తానికి ఆశించిన సీట్లు రాలే..
రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ 336 స్థానాల్లో గెలిచిందని, 25కు పైగా మున్సిపాలిటీల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, నిర్ణయాత్మకమైన పార్టీగా నిలిచిందని ఎన్.రాంచందర్ రావు అన్నారు. బీఆర్ఎస్కు గతంతో పోలిస్తే 500 స్థానాలు తగ్గాయని, 14 శాతం ఓట్లు కోల్పోయిందని ఎద్దేవా చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదని, గతంలో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయో ఇప్పుడు కాంగ్రెస్కు అన్నే వచ్చాయన్నారు.
బీజేపీకి మాత్రం గతంతో పోలిస్తే 100 సీట్లు అదనంగా పెరిగాయని తెలిపారు. ఎర్రజెండా ఎక్కడా లేకున్నా.. తెలంగాణలో కాంగ్రెస్ ఎర్రజెండాకు అధికారం వచ్చేలా చేస్తున్నదని మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ ఓటు పర్సంటేజీ తగ్గినా వారి ప్రభావం రాష్ట్రంలో పెరుగుతుందన్నారు.
దొంగ ఓట్లపై ‘సర్’అస్త్రం..
నిర్మల్లో మైనార్టీ ఓట్లు 20 శాతం నుంచి ఏకంగా 57 శాతానికి ఎలా పెరిగాయని ఎన్.రాంచందర్ రావు అనుమానం వ్యక్తం చేశారు. ఓనర్లకు తెలియకుండానే ఇండ్లలో ఓట్లు నమోదవుతున్నాయని, దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో దొంగ ఓట్లను ఏరివేసేందుకు ఏప్రిల్లో ‘సర్’చేపట్టబోతున్నామని తెలిపారు. మరోవైపు, పార్టీ విప్ జారీ చేసినా క్రాస్ ఓటింగ్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
మెట్పల్లిలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని, దీనిపై మంగళవారం సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నేతలు తాళ్ల వీరేందర్ గౌడ్, గౌతమ్ రావు, ఎన్వీ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
