హైవేపై ఇల్లీగల్ పార్కింగ్‌‌ వల్లే నా బిడ్డ మృతి

హైవేపై ఇల్లీగల్ పార్కింగ్‌‌ వల్లే నా బిడ్డ మృతి
  • హైకోర్టుకు లెటర్‌‌‌‌ రాసిన ఓ తండ్రి
  • లేఖను పిల్‌‌గా పరిగణించి విచారణ చేపట్టిన బెంచ్‌‌
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

హైదరాబాద్, వెలుగు : నేషనల్‌‌ హైవేపై ఇల్లీగల్‌‌గా వెహికల్స్‌‌ పార్కింగ్‌‌ చేయడం వల్ల జరిగిన ప్రమాదంలో తన కూతురు మృతి చెందిందని ఓ తండ్రి రాసిన లేఖను హైకోర్టు పిల్‌‌గా పరిగణించింది. నిజామాబాద్‌‌–కామారెడ్డి జాతీయ రహదారిపై అక్రమంగా వాహనాలు పార్కింగ్‌‌ చేయడం వల్ల తన కుమార్తె మరణించిందని పేర్కొంటూ నాగరాజు హైకోర్టుకు లెటర్‌‌ రాశారు. 2021లో తన కుటుంబం నిజామాబాద్‌‌ నుంచి కామారెడ్డికి వెళుతుండగా జరిగిన ప్రమాదంలో తన కూతురు చనిపోయిందని చెప్పారు.

ఈ పిల్‌‌ను చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ శ్రవణ్‌‌ కుమార్‌‌ల డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం విచారించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేయాలని ప్రతివాదులైన  కేంద్ర రవాణా శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రోడ్లు భవనాల శాఖలను ఆదేశించింది. అనం తరం విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది.