
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : రెండవ దశ ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభానికి శ్రీకారం చుట్టినట్లు తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీ వీ.పీ గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఇందిరమ్మ ఇండ్ల రెండో దశలో ఎంపిక చేయనున్న లబ్ధిదారుల వివరాలపై కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండో దశ మంజూరు పత్రాలను ఈ నెల 6వ తేదీ నాటికి లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని 20 మండలాలు, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట మున్సిపాలిటీల వారీగా ఇండ్ల నిర్మాణాల పురోగతి పై ఆరా తీశారు. గ్రామాలు, వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తుందని తెలిపారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన గ్రామాలు, వార్డుల్లో లక్ష్యం మేరకు నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇసుక, సిమెంట్ రేట్లు పెంచకుండా నియంత్రణ కమిటీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం ప్రతి మండలంలో సిమెంటు, ఇటుక, మేస్త్రీల రేట్లను పెంచకుండా రేట్ల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.
యువ వికాసం ద్వారా సెంట్రింగ్, ఇటుకల తయారీ యూనిట్ల స్థాపనకు కృషి చేయాలన్నారు. నాగర్ కర్నూల్ మండలం గగ్గలపల్లి, గ్రామంలో కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి హౌసింగ్ ఎండీ వీ.పీ గౌతమ్, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. అదనపు కలెక్టర్ దేవ సహాయం, పీడీ హౌసింగ్ సంగప్ప, డీఆర్డీఏ చిన్న ఓబులేసు, డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.