
హనుమకొండ కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసేది తానే అంటూ ప్రకటించుకున్నారు. పొరుగు జిల్లా నుంచి, పక్క పార్టీ నుంచి ఎవరూ వచ్చి తమపై పెత్తనం చేస్తే ఇక సహించమని హెచ్చరించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎదుటే తాను పోటీచేస్తానని ప్రకటించుకోవడం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అయితే నాయిని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు కరెక్టుగా మాట్లాడావని నాయిని రాజేందర్ రెడ్డిని సమర్థించారు.
గత కొద్ది కాలంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ లో వర్గ పోరు నడుస్తోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ కోసం డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, జనగామ డిసిసి అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి మధ్య పోటీ నెలకొంది. టికెట్ నాదంటే నాది అంటూ ఎవరికి వారే అనుచరుల దగ్గర చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా హాత్ సే హాత్ జోడో పాద యాత్ర సందర్భంగా వీరి వర్గ పోరు బయటపడింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాక సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నాయిని రాజేందర్ రెడ్డి వర్గీయులు, జంగా రాఘవరెడ్డి వర్గీయులు పోటా పోటీగా ఫ్లెక్లీలు నెలకొల్పారు. ఈ వివాదం నడుస్తుండగా ..తాజాగా రేవంత్ రెడ్డి సమక్షంలోనే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టికెట్ పై నాయిని రాజేందర్ రెడ్డి ప్రకటన వివాదాన్ని మరింత రాజేసింది.