ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

నల్గొండ అర్బన్​, వెలుగు: రైతుల సంక్షేమమే ధ్యేయంగా బీజేపీ పని చేస్తోందని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం నల్గొండ బీజేపీ ఆఫీస్​లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు బై ఎలక్షన్​ముందు గొర్రెల పంపిణీ పథకం కోసం7600  మంది గొర్రెల పెంపకం దారులతో రూ. 42,750  డీడీ కట్టించుకున్నారని,  కానీ నేటికీ గొర్రెలు రాకపోగా డీడీ డబ్బులు కూడా ఇస్తలేరన్నారు. యూపీఏ హయాంలో వరి మద్దతు ధర 1,360  ఉంటే నేడు రూ. 700లు పెంచి రూ.2,060 ఇస్తున్న ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా గుర్తు చేశారు.  కేంద్రం రూ.2.25లక్షల వేల కోట్లు భారం భరించి రైతులకు తక్కువ ధరకు ఎరువులు అందిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఇచ్చి అన్ని రాయితీలు బంద్​చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు న్యాయం చేయకుంటే గుణపాఠం తప్పదన్నారు. కిసాన్​మోర్చా జాతీయ కార్యదర్శి గోలి మధుసూదన్​రెడ్డి, రాష్ట్ర, బీజేపీ లీడర్లు  చంద్రశేఖర్, శ్యాంసుందర్​,  జగ్జీవన్ ఉన్నారు. 

రైతు సమస్యలపై కదం తొక్కిన్రు..

నల్గొండ అర్బన్/ సూర్యాపేట/ యాదాద్రి, వెలుగు : రైతు సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్​నేతలు విమర్శించారు.  పీసీసీ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. నల్గొండలో కాంగ్రెస్​రాష్ట్ర నాయకుడు దుబ్బాక నరసింహారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ కె.శంకర్​నాయక్​మాట్లాడుతూ కాంగ్రెస్​ప్రభుత్వంలో పేదలకు పంచిన భూములను కూడా గుంజుకుంటున్నారని మండిపడ్డారు.  ప్రభుత్వం వెంటనే ‘ధరణి’ ని రద్దు చేయాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్​చేశారు. కాంగ్రెస్​పార్టీ మునుగోడు ఇన్​చార్జి పాల్వాయి స్రవంతి, టీపీసీసీ మెంబర్​కొండేటి మల్లయ్య, చలమల కృష్ణారెడ్డి, డాక్టర్ చెరుకు సుధాకర్, టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాశ్​తదితరులు పాల్గొన్నారు.  

సూర్యాపేటలో..

రైతు సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని డీసీసీ ప్రెసిడెంట్​చెవిటి వెంకన్న యాదవ్ హెచ్చరించారు. పీసీసీ పిలుపు మేరకు సోమవారం కాంగ్రెస్​నాయకులు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్​ఎదుట ధర్నా చేశారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతి పత్రం కలెక్టరేట్​ఏవో కు అందించారు. పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్​చార్జి గుడిపాటి నర్సయ్య,  పీసీసీ  కోఆర్డినేటర్​బాలలక్ష్మి, యూత్​కాంగ్రెస్​ప్రెసిడెంట్​శైలేందేర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

యాదాద్రిలో..

ధరణి పోర్టల్​వల్ల కేసీఆర్​కుటుంబమే లాభపడుతోందని యాదాద్రి కాంగ్రెస్​లీడర్లు ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్​ఎదుట ధర్నా నిర్వహించారు. రైతు రుణమాఫీని విస్మరించిన ప్రభుత్వం రైతుబంధు, బీమా పథకాలను కూడా సరిగా అమలు చేయడం లేదన్నారు. అనంతరం అడిషనల్​ కలెక్టర్​శ్రీనివాస్​రెడ్డికి వినతిపత్రం అందించారు.  ఎంపీపీ రమేశ్​, టీపీసీసీ మెంబర్ రవికుమార్​,  ప్రమోద్​కుమార్  పాల్గొన్నారు.  

సహకార సంఘాల సేవలు పెంచాలి

కోదాడ, వెలుగు : ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను మరింత పెంచాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ , అన్నారు. సోమవారం చిలుకూరు మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన  పీఏసీఎస్​ బిల్డింగ్​ను  డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో సహకార సంఘాలు నిర్వీర్యమైపోయాయన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక లోన్లతో పాటు ఎరువులు, పురుగుమందుల కోసం ఫండ్స్​కేటాయిస్తున్నామన్నారు. రైతులు సహకార సంఘం సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.  అనంతరం గ్రామంలో  నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. సొసైటీ చైర్మన్ జనార్దన్, డీసీసీబీ డైరెక్టర్లు కొండా సైదయ్య, వీరస్వామి, ఫ్రీడం ఫైటర్​దొడ్డ నారాయణరావు, డీసీసీబీ సీఈవో మదన్​మోహన్​, టీఆర్ఎస్​లీడర్లు పాల్గొన్నారు. 

స్టూడెంట్లలో క్రియేటివిటీని వెలికితీయాలి

నల్గొండ అర్బన్, వెలుగు : స్టూడెంట్లలో దాగి ఉన్న క్రియేటివిటీని వెలికి తీసి వారిలో చైతన్యం నింపాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్​కుమార్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డాన్​బాస్కో స్కూల్​లో మూడు రోజులుగా జరుగుతున్న సైన్స్​ఫెయిర్​ముగింపు కార్యక్రమానికి వారు సోమవారం హాజరై మాట్లాడారు. స్టూడెంట్లు స్కూల్​స్టేజీ నుంచే లక్ష్యం పెట్టుకుని సాధించేందుకు కష్టపడాలన్నారు. విద్యార్థులను  కొత్త ఆవిష్కరణల వైపు ఆకర్షితులను చేయాలని, ఏటా కొత్త ఆవిష్కరణ చేయాలన్నారు. ప్రతిభ ఉన్న స్టూడెంట్లను  ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందన్నారు.ఉత్తమ ప్రతిభ చూపిన దేవరకొండ గిరిజన వెల్ఫేర్​ 9వ తరగతి  స్టూడెంట్​శిరీషకు ఎమ్మెల్యే గాదరి కిషోర్​ రూ. 10వేల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులను అందజేశారు. మున్సిపల్​చైర్మన్​ మందడి సైదిరెడ్డి, డీఈవో  భిక్షపతి, సైన్స్​ ఆఫీసర్​లక్ష్మీపతి, సునీల్​కుమార్​ పాల్గొన్నారు. 

తరగతి గదిలోనే భవిష్యత్ ​సైంటిస్టులు : జడ్పీ చైర్​పర్సన్ గుజ్జ దీపిక

సూర్యాపేట, వెలుగు: సైంటిస్టులు ఎక్కడినుంచో రారని, విద్యార్థుల ప్రతిభ, సృజనాత్మకతను గుర్తించి పదునుపెడితే తరగతి గదిలోనే తయారవుతారని జడ్పీ చైర్​పర్సన్​గుజ్జ దీపిక అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ‘జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్’ ను కలెక్టర్​హేమంత్​కేశవ్​తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు దేశంలో కొత్త ఆవిష్కరణలు, యువత ఉన్నత స్థానాల్లో నిలుస్తున్నారంటే ఆ ఘనత టీచర్లదేనన్నారు. సైన్స్​ఫెయిర్​లో తమ ప్రతిభను చూపేందుకు స్టూడెంట్లు భారీ సంఖ్యలో తరలిరావడం అభినందనీయమన్నారు. కలెక్టర్ హేమంత్ కేశవ్ మాట్లాడుతూ స్టూడెంట్లలో దాగి ఉన్న క్రియేటివిటీని వెలికి తీసేందుకు సైన్స్​ఫెయిర్లు నిర్వహిస్తున్నామన్నారు. ఇన్నోవేషన్​లో తెలంగాణ దేశంలోనే టాప్​–5 లో ఉందని కలెక్టర్​అన్నారు. స్టూడెంట్లు అబ్దుల్​కలాం, ఎంఎస్​స్వామినాథన్ లాంటి సైంటిస్టుల స్ఫూర్తితో ఎదగాలని సూచించారు.  మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, డీఈవో అశోక్, జిల్లా సైన్స్​ఆఫీసర్​దేవరాజ్, జడ్పీ సీఈవో సురేశ్​ తదితరులు పాల్గొన్నారు. 

త్వరలో బీజేపీలో చేరుతా : మాజీ ఎంపీపీ శ్రీనివాస్​గౌడ్

రాజాపేట, వెలుగు: దేశం బాగుకోసం పాటుపడే పార్టీ బీజేపీలో త్వరలో చేరబోతున్నానని టీఆర్ఎస్​మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజాపేట మాజీ ఎంపీపీ వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. సోమవారం మండలంలోని వీఎస్​జీ ఫంక్షన్​హాల్లో  ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడారు. తెలంగాణ   ఉద్యమకారులు నేడు టీఆర్ఎస్ లో ఎవరూ లేరని, పార్టీ ఫిరాయింపుదారులకు ఆ పార్టీ అడ్డాగా మారిందని విమర్శించారు. ఉద్యమ నినాదాలు అయిన నీళ్లు, నిధులు, నియామకాలను విస్మరించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని అధికారం చేపట్టిన కేసీఆర్ ఆ హామీలను తుంగలో తొక్కారన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన గులాబీ పార్టీకి  వచ్చే ఎన్నికల్లో  గుణపాఠం తప్పదన్నారు. కేసీఆర్​గారడి విద్య ఇక సాగదన్నారు. ఉద్యమంలో తనతో నడిచిన ప్రతి ఒక్కరూ భవిష్యత్​లోనే కలిసిరావాలని పిలుపునిచ్చారు. 

మట్టిని కాపాడుకుందాం

నెట్ వర్క్​, వెలుగు : జిల్లాలోని వివిధ మండలాల్లో సోమవారం ప్రపంచ మట్టి దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. నల్గొండ, నార్కట్​పల్లి, గరిడేపల్లి, మఠంపల్లి, హుజూర్​నగర్ మండలాల్లో మట్టిని రక్షించేందుకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నల్గొండలో సాయిల్​ఉద్యమ వలంటీర్లు  ఎన్జీ, మహిళా డిగ్రీ కాలేజీలతో పాటు పలు ప్రైవేట్ డిగ్రీ కాలేజీల ఆధ్వర్యంలో పట్టణంలో  మట్టిని కాపాడాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు. నార్కట్​పల్లి రైతు వేదికలో ఎంపీపీ నరేందర్​రెడ్డి మట్టి  నమూనాల పరీక్షలను పరిశీలించారు. గడ్డిపల్లి కేవీకేలో నిర్వహించిన కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి డి. రామారావు నాయక్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయంతోనే మట్టి కలుషితం కాకుండా కాపాడుకోవచ్చన్నారు.  మఠంపల్లి మండలంలోని పెడవీడు, హుజూర్​నగర్​, బూరుగుగడ్డ రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ అధికారులు మట్టిపై అవగాన కల్పించారు.  ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ క్షీణిస్తున్న మట్టి మానవాళి ఉనికికి ముప్పుగా  మారుతోందని కలుషితం కాకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.