
-
ఈ విషయంపై పునరాలోచించాలి: నామా
న్యూఢిల్లీ, వెలుగు: కృష్ణానదిపై ఉన్న నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు అప్పగిస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత నామా నాగేశ్వర్ రావు అన్నారు. ఆ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడం వల్ల తెలంగాణకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఈ విషయంలో పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల హక్కులకు నష్టం కలిగించే ఏ అంశాన్ని అంగీకరించే ప్రసక్తేలేదన్నారు. సోమవారం లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో బీఆర్ఎస్ తరఫున నామా పాల్గొన్నారు.
విభజన హామీల అమలు విషయంలో కేంద్రం తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తూ వచ్చిందన్నారు. రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తికావస్తున్నా.. ఇంకా చాలా హామీలు అమలుకు నోచుకోలేదని గుర్తుచేశారు. నవోదయ విద్యాలయాలు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం వంటి హామీలపై బీఆర్ఎస్ పోరాడుతూనే ఉందన్నారు. తెలంగాణలో అత్యధికంగా సాగవుతున్న ఆయిల్ పామ్ పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ వ్యవసాయ రంగానికి, రైతులకు మొండిచేయి చూపిందని విమర్శించారు. పీఎం కిసాన్ సాయాన్ని పెంచుతామని చెప్పి, ఉసూరుమనించారని ఫైర్ అయ్యారు. 2022– 23 నాటికి దేశంలో రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని చెప్పిన కేంద్రం.. బడ్జెట్లో ఆ మాటే మాట్లాడలేదని విమర్శించారు.