కూనంనేని ఎమ్మెల్యేగా విజయం సాధించడంపై అభినందించిన నారాయణ, చాడ

కూనంనేని ఎమ్మెల్యేగా విజయం సాధించడంపై అభినందించిన నారాయణ, చాడ

హైదరాబాద్, వెలుగు : కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్యెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందిన సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావును, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అభినందించారు. సోమవారం హైదరాబాద్‌‌లోని పార్టీ ఆఫీసులో కూనంనేనికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ సీపీఐ మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు అభినందనలు తెలిపారు.

నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి, కుటుంబ, నియంత పాలన, బీఆర్ఎస్ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలతో ప్రజలు విసిగిపోయి ఓడించారని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పల్లె నరసింహ, కసిరెడ్డి మణికంఠరెడ్డి, ఏ.గోవింద్ రావు తదితరులు పాల్గొన్నారు.