మహబూబ్ నగర్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఎస్పీ వినీత్, అడిషనల్ కలెక్టర్ శ్రీను హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసులను సీరియస్ గా తీసుకోవాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు త్వరగా పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్లోకి సంబంధిత విభాగం సిబ్బందికి సూచించారు.
డీఎస్పీ నల్లపు లింగయ్య రెండేండ్లుగా జిల్లాలో నమోదైన కేసుల వివరాలను వివరించారు. ప్రతి నెలా 30న సివిల్ రైట్స్ డే నిర్వహించి మినిట్స్ అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. గిరిజన సంఘం నాయకుడు కిష్ట్యా నాయక్ మాట్లాడుతూ నాలుగైదు రోజుల తరువాత ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేస్తున్నారని కమిటీ దృష్టికి తీసుకురాగా, తన ఆఫీస్కు వచ్చి తెలియజేయాలని ఎస్పీ వినీత్ సూచించారు. సభ్యుడు ఆశప్ప, ఆర్డీవో రాంచందర్ నాయక్, డీఏవో జాన్ సుధాకర్, డీఎంహెచ్వో శైలజ, డీపీవో సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
