- చైర్ పర్సన్ న్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ
మహబూబ్నగర్, వెలుగు : నారాయణపేట మున్సిపాల్టీని దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో ఇతరుల మద్దతుతోనే చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాల్సి రావడంతో రెండు పార్టీలకు చెందిన కౌన్సిలర్లను ఇప్పటికే క్యాంపులకు తరలించాయి.
అయితే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన బీజేపీ రెబల్ అభ్యర్థి జయశ్రీ ఆ పార్టీకే మద్దతు తెలిపారు. శనివారం ఉదయం ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచంద్రావు సమక్షంలో తిరిగి పార్టీలో చేరారు. దీంతో బీజేపీ కౌన్సిలర్ల బలం 11గా ఉండగా, ఆమె చేరికతో 12కు చేరింది. అయితే ఈ మున్సిపాల్టీలో 24 వార్డులు ఉండగా, చైర్ పర్సన్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 13 కౌన్సిలర్ స్థానాలు అవసరం.
ఇప్పటి వరకు బీజేపీకి 12 కౌన్సిలర్ స్థానాలు మాత్రమే ఉన్నాయి. మిగతా వారి మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తుండగా ఫలితాలు దక్కడం లేదు. ఈ క్రమంలో ముందస్తుగా మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఎక్స్-ఆఫీషియో ఓటు కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. దీంతో ఆమె ఓటు హక్కును వినియోగించుకుంటే ఆ పార్టీ బలం 13కు చేరుకుంటుంది. కానీ రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బడా నేత ఎంటర్ కావడంతో సమీకరణలు మారుతున్నాయి. ఈ మున్సిపాల్టీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఖాతాలోకి వెళ్లరాదని ఆయన పావులు కదుపుతున్నట్లు తెలిసింది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఏడు కౌన్సిలర్ స్థానాలు రాగా, రెండు స్థానాల్లో ఎంఐఎంకు మద్దతు ఇచ్చి గెలిపించుకుంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసి గెలుపొందిన మరో అభ్యర్థి మద్దతూ కూడగట్టుకుంది. దీంతో ఈ ముగ్గురిని కలుపుకొని కాంగ్రెస్కు 10 మంది కౌన్సిలర్ల బలం ఏర్పడింది. ప్రస్తుతం ఈ ముగ్గురు కాంగ్రెస్ శిబిరంలోనే ఉన్నారు. అయితే బడా నేత బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు కౌన్సిలర్ల మద్దతును కూడగట్టేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన నియోజకవర్గ లీడర్తో మాట్లాడినట్లు సమాచారం.
వీరిద్దరి మద్దతును కూడగడితే కాంగ్రెస్కు 12 కౌన్సిలర్ల బలం చేకూరుతుంది. దీంతో బడా నేత ముందస్తుగా స్థానిక ఎమ్మెల్యే పర్ణికా రెడ్డిని ఎక్స్ ఆఫీషియో కోసం అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పడంతో ఆమె ఈ ఓటు కోసం అప్లికేషన్ పెట్టుకుంది. ఆమె ఓటు హక్కును వినియోగించుకుంటే కాంగ్రెస్కు 13 ఓట్ల బలం లభిస్తుంది. అలాగే బీజేపీకి కూడా 13 మంది బలం చేకూరుతుంది. దాంతో టాస్ ద్వారానే చైర్పర్సన్ పీఠాన్ని లక్కీగా ఎవరు దక్కించుకుంటారోననే చర్చ నడుస్తోంది.
