అస్సాం కాంగ్రెస్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ కేవలం రాహుల్ గాంధీతోనే భయపడతారని అస్సాం కాంగ్రెస్ ప్రెసిడెంట్ రిపున్ బోరా చెప్పారు. రాహుల్కు మోడీ భయపడతారు కాబట్టి ఆయనకు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని తాను సోనియాను కోరానన్నారు. ‘ఇవ్వాళ జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ, రాజ్యసభ ఎంపీలు పాల్గొన్నారు. పార్టీ నాయకత్వ బాధ్యతలను రాహుల్ గాంధీకి అప్పగించాలని ఈ సమావేశంలో సోనియాను కోరా’ అని బోరా పేర్కొన్నారు.
గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి రాహుల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్టీకి తాత్కాలిక చీఫ్గా వ్యవహరిస్తున్న సోనియా ఆ పదవిలో ఎక్కువ కాలం కొనసాగడానికి అయిష్టత చూపిస్తున్నారు. సీనియర్ నేతలు కూడా పార్టీ నాయకత్వ మార్పును కోరుతూ అధినేత్రికి లేఖ రాశారు. లెటర్ రాసిన నేతలను పార్టీ కొత్త చీఫ్ను కనుగొనాలని ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్లో సోనియా చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ కొత్త చీఫ్ ఎవరనే ప్రశ్న ఇంట్రెస్టింగ్గా మారింది.