- రివర్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తం: ప్రకాశ్
హైదరాబాద్, వెలుగు: నదుల హక్కులపై తాము గొంతు విప్పుతామని వాటర్ రీసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి.ప్రకాశ్ అన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్లో ‘‘నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రివర్స్’’ నిర్వహించనున్నట్లు చెప్పారు. గురువారం ఆయన ఖైరతాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో కాన్ఫరెన్స్ బ్రోచర్ను ఆవిష్కరించి మాట్లాడారు. మొదటి రోజు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్రసింగ్ ‘‘రివర్ మేనిఫెస్టో’’ రిలీజ్ చేస్తారని, దానిపై చర్చ ఉంటుందని చెప్పారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఎక్స్పర్ట్లు ‘‘నోయింగ్ ఆఫ్ రివర్స్’’ పేరుతో కృష్ణా, గోదావరి, కావేరి, నర్మదా, తాపి, బ్రహ్మపుత్ర, గంగా, సింధూ, మహానదులపై ప్రజంటేషన్ ఇస్తారని తెలిపారు. రెండో రోజు దేశంలోని నదుల పరిస్థితి, వాటిని పునరుజ్జీవింపజేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎక్స్పర్ట్ల ప్రజంటేషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ సదస్సులో తెలంగాణ, కర్నాటకకు చెందిన మంత్రులు పాల్గొంటారన్నారు. సిక్కిం, అరుణాచల్ప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల నుంచి 200 మంది ఎక్స్పర్ట్లు వస్తారని చెప్పారు.
జూన్ లో నేషనల్ రివర్ వీక్..
ఏప్రిల్ 14, 15 తేదీల్లో ఢిల్లీలో ‘‘రివర్ కల్చర్’’ అంశంపై సదస్సు నిర్వహిస్తామని వెల్లడించారు. కాన్ఫరెన్స్ లో చర్చించిన అంశాలపై అన్ని రాష్ట్రాల్లోనూ సమావేశాలు పెడ్తామని, ఆ తర్వాత జూన్లో హైదరాబాద్ కేంద్రంగా వారం పాటు నేషనల్ రివర్ వీక్ నిర్వహిస్తామని తెలిపారు. కృష్ణాలో సర్ప్లస్ వాటర్ ఆధారంగా ఏపీ, తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులు, రాయలసీమ లిఫ్ట్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ఇతర ప్రాజెక్టులపైనా సమావేశంలో చర్చిస్తామన్నారు. దేశంలోని అన్ని నదులను పునరుజ్జీవింపజేయడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకోసం రివర్ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో శ్యాంప్రసాద్రెడ్డి, రమణ నాయక్, ఖగేందర్, వెంకటేశం, శంకర్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.