మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

వనపర్తి మెడికల్ కాలేజీకి పర్మిషన్ వచ్చిందన్న మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి, వెలుగు: వనపర్తి మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్​పర్మిషన్​ ఇచ్చిందని,  ఈ  అకడమిక్​ఇయర్​ నుంచే క్లాసులు స్టార్ట్​అవుతాయని  మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. గురువారం మంత్రి మాట్లాడుతూ  వనపర్తి జిల్లాతో పాటు సంగారెడ్డి మెడికల్​కాలేజీ కి  పర్మిష న్​ వచ్చిందన్నారు. వనపర్తి జిల్లాలో ఇప్పటికే మెడికల్ కాలేజీ బిల్డింగ్​ రెడీగా ఉందన్నారు.  150 సీట్లతో   క్లాసుల  నిర్వహణకు పర్మిషన్​ వచ్చిందని, కాలేజీ నిర్మాణానికి 50 ఎకరాల స్థలం కేటాయించామన్నారు. రూ.510 కోట్లతో మెడికల్ కాలేజీ బిల్డింగ్​, పరిపాలనా భవనం, విద్యార్థుల, సిబ్బంది హాస్టల్​ భవనాల  నిర్మాణం చేపడుతున్నామన్నారు.   

సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి
సమాజంలో  సైబర్ నేరాలపై  స్టూడెంట్లు  అవగాహన పెంచుకోవాలని  కలెక్టర్​ షేక్ ​యాస్మిన్​బాషా పిలుపునిచ్చారు. క్రైమ్స్​ను  ప్రజలకు వివరించి చైతన్యం చేయాలని కలెక్టర్లు, ఎస్పీలు, అడిషనల్​ఎస్పీలు సూచించారు. గురువారం పాలమూరులో  సైబర్​ నేరాల కంట్రోల్​కు  స్టూడెంట్లకు నిర్వహించిన  ‘సైబర్​ కాంగ్రెస్ ​గ్రాండ్​ ఫినాలె’ ట్రైనింగ్​ కార్యక్రమాలు ముగిశాయి.  ఈ సందర్భంగా హాజరైన పలువురు మాట్లాడుతూ  సైబర్ క్రైమ్స్ ను  స్టూడెంట్స్ ముందుగానే పసిగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గద్వాల ఇన్ చార్జి కలెక్టర్ శ్రీ హర్ష , - ఎస్పీలు  ఆర్.వెంకటేశ్వర్లు,  ఎన్. ​వెంకటేశ్వర్లు, అడిషనల్​ఎస్పీ షాకీర్​హుస్సేన్ జిల్లాల అధికారులు మాట్లాడారు. ‌‌
  - నెట్​వర్క్​, వెలుగు

సీఎం మొండి వైఖరి వీడాలి: బీజేపీ స్టేట్ లీడర్  కొండయ్య 
మక్తల్, వెలుగు: వీఆర్ఏలు 18 రోజులుగా దీక్ష చేస్తుంటే సీఎం కేసీఆర్​ స్పందించకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని బీజేపీ స్టేట్ లీడర్ కొండయ్య  మండిపడ్డారు. గురువారం పట్టణంలో నిర్వహిస్తున్న వీఆర్ఏల దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా పే స్కేల్ పద్ధతిన వేతనాలు ఇస్తామని వాగ్ధానం చేశారన్నారు. 56 ఏండ్లు దాటిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి  రెండేళ్లు గడుస్తున్నా నేటికీ హామీని నెరవేర్చలేదన్నారు. సీఎం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్  చైర్​పర్సన్​పావని, వైస్ చైర్​పర్సన్​అఖిల, బీజేపీ లీడర్లు భాస్కర్, కర్ని స్వామి,  నరసింహారెడ్డి,  బలరాం రెడ్డి, మంతన్ గోడ్ సర్పంచ్ అంజమ్మ  తదితరులు పాల్గొన్నారు.
 

విద్యార్థులు చదువులో రాణించాలి: సురవరం సుధాకర్ రెడ్డి 
అలంపూర్, వెలుగు: విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్​లో ఉన్నత స్థాయికి ఎదగాలని సీపీఐ  జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ఉండవెల్లి మండల పరిధిలోని కంచుపాడు గ్రామంలోని సురవరం వెంకట్రామరెడ్డి విజ్ఞాన కేంద్రం లో గురువారం టెన్త్​పాస్​అయిన21మంది స్టూడెంట్లకు ప్రోత్సాహక బహుమతులు, మహాత్మా గాంధీ జీవిత చరిత్ర  పుస్తకంతో పాటు రూ. 216 చెక్​ను  అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి విజయలక్ష్మి,  సర్పంచ్ శేషన్ గౌడ్ , విజ్ఞాన కేంద్రం మేనేజర్ వీరాంజనేయుడు, ఏఐవైఎఫ్ లీడర్​నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు కలెక్టర్​ రాఖీ శుభాకాంక్షలు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లాలోని మహిళలందరికీ కలెక్టర్ ఉదయ్ కుమార్ రాఖీ  పౌర్ణమి  శుభాకాంక్షలు తెలిపారు. గురువారం కలెక్టరేట్​లో బ్రహ్మకుమారీస్​ నాగర్ కర్నూల్  ఇన్​చార్జి  సుజన, ప్రభ, విజయ కలెక్టర్​కు రాఖీ కట్టారు.  ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా సాధికారిత సాధించేందుకు ప్రతి ఒక్క అన్న , తమ్ముడు చేయూతనందించేందుకు కృషి చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి రాఘవయ్య, వీణ  పాల్గొన్నారు. 

స్వాతంత్ర్య  వేడుకలు వైభవంగా నిర్వహించాలి   
75వ స్వాతంత్య్ర వేడుకలు వైభవంగా నిర్వహించాలని కలెక్టర్‌ పి ఉదయ్ కుమార్ వివిధ శాఖల హెచ్​వోడీలను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్​లో  వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై అడిషనల్​కలెక్టర్లు మను చౌదరి, మోతీలాల్ లతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వేడుకల్లో ఎటువంటి పొరపాటు లేకుండా అధికారులకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించి కార్యక్రమాన్ని  సక్సెస్​చేయాలన్నారు. 

 స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత కాంగ్రెస్​దే..
దేవరకద్ర, వెలుగు:  దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత కాంగ్రెస్​ పార్టీ దే అని  టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్​కుమార్​ గౌడ్​, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండ ప్రశాంత్ రెడ్డి అన్నారు.  గురువారం దేవరకద్ర మండలంలో  చేపట్టిన ‘ఆజాదీ కా గౌరవ్ పాదయాత్ర’  లక్ష్మిపల్లి లో ప్రారంభమై  బస్వాయపల్లి, హాజిలాపూర్, చౌదర్ పల్లి, దేవరకద్ర పట్టణంలో సాగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు ధరలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపుతున్నాయన్నారు.  సీఎం కేసీఆర్​ ఎన్నికల  హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. 


కృష్ణానది తీర ప్రాంత ప్రజలు అలర్ట్​గా ఉండాలి: ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్​ రెడ్డి
మక్తల్, వెలుగు:  కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి భారీగా వరద వస్తోందని, నది తీర ప్రాంతాల ప్రజలు అలర్ట్​గా ఉండాలని ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్ రెడ్డి  సూచించారు. గురువారం ఆయన మక్తల్​ మండలం పస్పుల  వద్ద కృష్ణమ్మ పరవళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  కర్ణాటక లోని నారాయణపూర్, ఆల్మట్టి   డ్యామ్​ ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో వరద ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు.  కృష్ణ , మాగనూర్​, మక్తల్ మండలాల పరిధిలోని   నది తీర ప్రాంత ప్రజలను రెవెన్యూ, పోలీస్​ అధికారులు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లొద్దని ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యే  వెంట సీఐ సీతయ్య, ఎస్సై పర్వతాలు, రెవెన్యూ ఆఫీసర్లు ఉన్నారు.

కరెంట్​ షాక్ తో రైతు మృతి
వీపనగండ్ల, వెలుగు: మండల పరిధిలోని సంగినేని పల్లి గ్రామంలో గురువారం  కరెంట్​ షాక్ తో ఓ రైతు చనిపోయాడు. ఎస్సై రామన్​గౌడ్​వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆల్లె ఆంజనేయులు(40) వ్యవసాయ బావి వద్ద ట్రాన్స్ ఫార్మర్ ను ​ఆన్​చేయడానికి వెళ్లగా  ప్రమాదవశాత్తు షాక్​కొట్టడంతో స్పాట్​లోనే చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెళ్లి డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేపడుతున్నామని ఎస్సై తెలిపారు. 

పోలీస్​స్టేషన్​కుఇన్​వర్టర్ ​అందజేత
నవాబుపేట, వెలుగు:  బీజేపీ జిల్లా నాయకురాలు బాలత్రిపుర సుందరి గురువారం నవాబుపేట పోలీస్​స్టేషన్​కు  ఇన్వర్టర్​ను అందజేశారు. పోలీస్​ స్టేషన్​లో పవర్ ప్రాబ్లమ్​ఉందన్న విషయాన్ని  ఆమె దృష్టికి తీసుకెళ్లగా   రూ. 60వేల విలుగల ఇన్వర్టర్​ను  ఎస్సై శ్రీకాంత్​కు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై, సిబ్బంది ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పసుపుల యాదయ్య, సత్యం, శ్రీను, ఆనంద్​ పాల్గొన్నారు. 


పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

వనపర్తి, వెలుగు: పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని, విధిగా అందరూ మొక్కలు నాటాలని జిల్లా అడిషనల్ ఎస్పీ  షాకీర్ హుస్సేన్ సూచించారు.  వన మహోత్సవ  కార్యక్రమంలో భాగంగా  గురువారం  వనపర్తి దగ్గరలోని శ్రీనివాసపూర్ అటవీశాఖ ఆధ్వర్యంలో  పోలీసులు, అటవీశాఖ అధికారులు సిబ్బందితో కలిసి 5వేల  మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్టేషన్లలో మొక్కలు నాటాలని చెప్పారు. చెట్లను మానవాళి అవసరాల కోసం నరికివేయడం, అందుకు అనుగుణంగా మొక్కల పెంపకం చేపట్టకపోవడంతో కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. అందువల్ల ప్రతి  ఒక్కరూ విధిగా మొక్కలు నాటడం ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.  డీఎస్పీ ఆనంద్ రెడ్డి, ఎఫ్ ఆర్వో రామకృష్ణ,  మహేందర్, వాణికుమారి, సీఐ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్ర్య వేడుకలను సక్సెస్​ చేయాలి:ఇన్ చార్జి కలెక్టర్ శ్రీహర్ష 
గద్వాల, వెలుగు :  ఆగస్టు 15న నిర్వహించే ఇండిపెండెన్స్​డే వేడుకలను సక్సెస్ చేయాలని గద్వాల జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్​లో జిల్లా అధికారులతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15 వేడుకలను థైరాయిడ్ గ్రౌండ్ లో నిర్వహించేలా ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. గ్రౌండ్ ని చదును చేయాలని ఆర్ అండ్ బి ఆఫీసర్లను ఆదేశించారు. భారీకేడ్లు, డయాస్​కార్యక్రమాలను ఆఫీసర్లు దగ్గరుండి 
చేయించాలన్నారు.  

ట్రాఫిక్​ కంట్రోల్​కు ఎస్పీ సూచనలు
జడ్చర్ల టౌన్​, వెలుగు: జడ్చర్ల పట్టణంలో ట్రాఫిక్​ను కంట్రోల్​చేసేందుకు ఎస్పీ వెంకటేశ్వర్లు మున్సిపల్ చైర్​పర్సన్​, అధికారులకు  పలు సూచనలు చేశారు. గురువారం జడ్చర్లలో పర్యటించిన ఆయన సిగ్నల్​ గడ్డ, తెలంగాణ చౌరస్తా, కొత్త బస్టాండ్ ప్లై ఓవర్​బ్రిడ్జి వద్ద  ట్రాఫిక్​సమస్యలను  పరీశీలించారు. ఈ సందర్భంగా అవసరమైనచోట్ల రోడ్డు వెడల్పుతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను  అధికారులకు వివరించారు. 

‘రక్షాబంధన్’ కు అన్ని ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ ఎస్.వెంకట్ రావు 
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు:  స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా  శుక్రవారం ఉదయం 11 గంటలకు జడ్పీ మైదానంలో నిర్వహించనున్న జాతీయ రక్షా బంధన్ ప్రోగ్రామ్​కు  అన్ని ఏర్పాట్లు  చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంపు ఆఫీస్​నుంచి ఏర్పాట్లపై సంబంధిత ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.  రక్షాబంధన్ తోపాటు హెల్త్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తామన్నారు.  అంగన్​వాడీ, మహిళా సంఘాల సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని సక్సెస్ ​చేయాలని పిలుపునిచ్చారు.  అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, జిల్లా సంక్షేమాధికారి జరీనా, డీఆర్డీవో యాదయ్య పాల్గొన్నారు. 

13న ర్యాలీకి అన్ని ఏర్పాటు చేయాలి
ఈ నెల 13 నిర్వహించనున్న ర్యాలీకి   అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా, మండల, గ్రామ స్థాయి  అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని జడ్పీమైదానంలో నుంచి  తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ జరుగుతుందని,   సక్సెస్​ చేయాలన్నారు.  

ట్రాఫిక్​ కంట్రోల్​కు ఎస్పీ సూచనలు
జడ్చర్ల టౌన్​, వెలుగు: జడ్చర్ల పట్టణంలో ట్రాఫిక్​ను కంట్రోల్​చేసేందుకు ఎస్పీ వెంకటేశ్వర్లు మున్సిపల్ చైర్​పర్సన్​, అధికారులకు  పలు సూచనలు చేశారు. గురువారం జడ్చర్లలో పర్యటించిన ఆయన సిగ్నల్​ గడ్డ, తెలంగాణ చౌరస్తా, కొత్త బస్టాండ్ ప్లై ఓవర్​బ్రిడ్జి వద్ద  ట్రాఫిక్​సమస్యలను  పరీశీలించారు. ఈ సందర్భంగా అవసరమైనచోట్ల రోడ్డు వెడల్పుతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను  అధికారులకు వివరించారు. 

ఉరకలేస్తున్న కృష్ణమ్మ
గద్వాల, వెలుగు:  కర్ణాటక ప్రాజెక్టుల నుంచి వరద పోటెత్తుతుండడంతో జూరాల వద్ద కృష్ణమ్మ ఉరకలేస్తోంది. ప్రస్తుతం జూరాలలో పూర్తిస్థాయి నీటిమట్టం 1045 ఫీట్లు, 9.657 టీఎంసీలు నిల్వ ఉంచుకొని 38 గేట్లు ఓపెన్ చేసి 2,19,810 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాలకు 2,36 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తున్నది. 

జాతి సమైక్యతకు పాటుపడాలి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోష్​గా ఫ్రీడమ్​ రన్​
నెట్​వర్క్​, వెలుగు:  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. స్వాతంత్ర్య  వజ్రోత్సవాల్లో భాగంగా  జిల్లా, మండల కేంద్రాల్లో ఫ్రీడం రన్​ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మంత్రులు, శ్రీనివాస్​గౌడ్​,  నిరంజన్​రెడ్డి, పలువురు జడ్పీ చైర్మన్లు, చైర్​పర్సన్లు,  ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు హాజరై ర్యాలీలు ప్రారంభించారు.  అధికార యంత్రాంగం, స్టూడెంట్లు, యువకులు, జాతీయ జెండాలు పట్టుకుని పరుగులు తీశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్​రెడ్డి, పలువురు మాట్లాడుతూ  స్వాతంత్ర్యం  తీసుకొచ్చిన మహనీయులను స్మరిస్తూ, స్వాతంత్ర్య ఉద్యమాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని, యువత  దేశభక్తిని గుండెల్లో నింపుకొని జాతీయ సమైక్యతకు పాటు పడాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగాన్ని  రూపొందించడంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎంతో శ్రమించారని ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.