నారాయణపేట, వెలుగు : యాసంగి సీజన్లో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వరి ధాన్యం అక్రమంగా రాకుండా, అలాగే ఇక్కడి పీడీఎస్ బియ్యం బయటకు వెళ్లకుండా నారాయణపేట జిల్లా సరిహద్దుల్లో ఆరు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.
జలాల్పూర్, కాన్కుర్తి, చేగుంట, కృష్ణ బ్రిడ్జి, సమస్తాపూర్, ఉజ్జెల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ చెక్ పోస్టుల వద్ద పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ 24 గంటల నిఘా ఉంచుతారని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక సరిహద్దుల నుంచి వచ్చే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, వే బిల్లులు, అనుమతి పత్రాలు లేని వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సరిహద్దు గ్రామాల ద్వారా దొంగచాటుగా రవాణా జరగకుండా ప్రత్యేక పహారా ఏర్పాటు చేశామన్నారు.

