హోరాహోరీగా నేషనల్‌‌ ఖోఖో ఛాంపియన్‌‌ షిప్‌‌..కాజీపేట రైల్వే స్టేడియంలో నిర్వహణ

హోరాహోరీగా నేషనల్‌‌ ఖోఖో ఛాంపియన్‌‌ షిప్‌‌..కాజీపేట రైల్వే స్టేడియంలో నిర్వహణ
  • సోమవారం 64 మ్యాచ్‌‌ల నిర్వహణ

హనుమకొండ/ధర్మసాగర్, వెలుగు : హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేడియంలో నిర్వహిస్తున్న 58వ నేషనల్ సీనియర్స్ ఖోఖో ఛాంపియన్‌‌ షిప్‌‌ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఖోఖో ఫెడరేషన్‌‌ ఆఫ్ ఇండియా, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీల్లో మెన్, ఉమెన్స్‌‌ విభాగాలకు చెందిన 79 టీమ్స్ తలపడుతున్నాయి. 

సోమవారం 64 మ్యాచ్‌‌లు జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. పురుషుల విభాగంలో చత్తీస్‌‌గఢ్‌‌, ఆలిండియా పోలీస్ టీమ్ మధ్య మ్యాచ్‌‌ జరుగగా.. చత్తీస్‌‌గఢ్‌‌ 26 పాయింట్లు, ఆల్ ఇండియా పోలీస్ టీమ్ 25 పాయింట్లు సాధించాయి. దీంతో ఒక్క పాయింట్‌‌ తేడాతో చత్తీస్‌‌గఢ్‌‌ టీమ్‌‌ విజయాన్ని దక్కించుకుంది. మరో మ్యాచ్‌‌లో ఢిల్లీ, సిక్కీం జట్లు తలపడగా... ఢిల్లీ 89 పాయింట్లు సాధించగా.. సిక్కిం కేవలం ఆరు పాయింట్లు మాత్రమే సాధించి ఓటమి పాలైంది. 

అలాగే ఛత్తీస్‌‌గఢ్‌‌ ఆర్మ్డ్‌‌ పోలీస్‌‌ టీమ్‌‌ మధ్య మ్యాచ్‌‌లో ఛత్తీస్‌‌గఢ్‌‌, విదర్భ, ఉత్తరాఖండ్‌‌ మ్యాచ్‌‌లో విదర్భ, పుదుచ్చేరి, చండీగఢ్‌‌ మ్యాచ్‌‌లో పుదుచ్చేరి విజయం సాధించాయి. మహిళల విభాగంలో హరియాణా, మధ్యభారత్‌‌ టీమ్‌‌లో పోటీ పడగా.. చెరో 24 పాయింట్లు సాధించడంతో మ్యాచ్‌‌ టైగా ముగిసింది. 

తెలంగాణతో పోటీ పడి రాజస్థాన్‌‌, గోవాతో పోటీ పడి పంజాబ్‌‌ విజయం సాధించాయి. పోటీలను తెలంగాణ ఖోఖో అసోసియేషన్‌‌ ప్రెసిడెంట్, ఆయిల్‌‌ఫెడ్‌‌ కార్పొరేషన్‌‌ చైర్మన్‌‌ జంగా రాఘవరెడ్డి పర్యవేక్షించారు. క్రీడాకారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.