ప్రతి ఏటా ఆగష్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుతారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా ఆ రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు పలు క్రీడలకు చెందిన ఆటగాళ్లకు పురస్కారాలు అందజేస్తారు. అయితే ఈ సంవత్సరం కరోనా కారణంగా అవార్డుల ప్రదానోత్సవం ఆన్లైన్ వేదికగా జరగనుంది. ఆటగాళ్లందరూ ఆన్లైన్ ద్వారా ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొంటారు.
‘ఈ సంవత్సరం స్పోర్ట్స్ అవార్డ్స్ ఫంక్షన్ ఆన్లైన్ లో జరిగే అవకాశం ఉంది. భారత ప్రభుత్వ సూచనల మేరకు అవార్డులు పొందినవారి పేర్లను ఆగష్టు 29 ఉదయం ప్రకటిస్తారు’ అని క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. అవార్డుల కోసం ఆటగాళ్లు సమర్పించే ఆన్లైన్ దరఖాస్తులను జూన్ లోనే సమర్పించాల్సి ఉంది. కానీ, కరోనా వల్ల ఆన్లైన్ దరఖాస్తుల గడువును మంత్రిత్వ శాఖ పొడిగించింది. కాగా.. లాక్డౌన్ వల్ల ఆటగాళ్లను సిఫారసు చేయడానికి ఎవరూ ముందుకురాకపోవడంతో.. ఎవరికి వారే స్వయంగా నామినేట్ చేసుకోవచ్చని తెలిపింది. దాంతో అవార్డుల కోసం ఆటగాళ్లు భారీ సంఖ్యలో దరఖాస్తులు పంపారు.
జాతీయ క్రీడా పురస్కారాలలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు మరియు ధ్యాన్ చంద్ అవార్డులు ఉన్నాయి. ఈ అవార్డులను ప్రతి సంవత్సరం ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్ లో భారత రాష్ట్రపతి ఆటగాళ్లకు ప్రదానం చేస్తారు.
For More News..