- హర్యాన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
గజ్వేల్, వెలుగు: ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశంలో గ్రామగ్రామాన జాతీయ వాదం విస్తరిస్తోందని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బుధవారం ఆయన గజ్వేల్ మండలం రిమ్మనగూడలోని ఓ ఫామ్హౌజ్లో నియోజకవర్గంలో నూతనంగా గెలుపొందిన బీజేపీ సర్పంచ్లను సన్మానించారు.
అనంతరం మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకానికి 'వీబీ జీ రామ్ జీ' గా పేరు మార్పు చేసి 100 నుంచి 120 రోజుల పనిదినాలను పెంచామన్నారు. అవినీతి అక్రమాలకు తావులేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ దేశానికి జాతీయ వాదమే శ్రీరామ రక్ష అన్నారు. సమాజంలో డబ్బు ప్రధానం కాదని, మానవ సంబంధాలు ముఖ్యమన్నారు. బీజేపీ ప్రభుత్వంలో రైతులకు, రైతు కూలీలకు నేరుగా వారి అకౌంట్ల లోనే డబ్బులు జమవుతున్నాయన్నారు.
దేశభక్తిని చాటుతూ ఎక్కువమంది యువకులు బీజేపీలోకి రావడం సంతోషమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, నాయకులు ప్రసాద్రావు, రామ్రెడ్డి, భాస్కర్, రాములు, మల్లేశం, పార్టీ మండలాల అధ్యక్షులు మనోహర్యాదవ్, అశోక్గౌడ్, ఐలయ్య యాదవ్, సంపత్రెడ్డి, పలువురు సర్పంచ్ లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
