![కాళేశ్వరం స్కాంపై దేశ వ్యాప్తంగా చర్చ : గోవా సీఎం సావంత్](https://static.v6velugu.com/uploads/2023/11/nationwide-discussion-on-kaleshwaram-scam-says-goa-cm-sawant_aC4XAnqDT8.jpg)
కాళేశ్వరం ప్రాజెక్టు స్కాంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. ఆ ప్రాజెక్టు నిర్మాణం అంతా పెద్ద కుంభకోణమని, రీడిజైన్ పేరుతో ప్రాజెక్టు ఖర్చును భారీగా పెంచారన్నారు. సోమవారం సోమాజిగూడలోని బీజేపీ మీడియా పాయింట్ లో సావంత్ మీడియాతో మాట్లాడారు. తొమ్మిదేండ్ల నుంచి జాబ్ లు భర్తీ చేయక ఈ ప్రభుత్వం లక్షల మంది నిరుద్యోగులను మోసం చేసిందన్నారు.
పేపర్ లీకేజీతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. ఒక్క రాష్ట్రం ఏర్పాటు చేయటానికి కాంగ్రెస్ పార్టీ 1200 మందిని బలి తీసుకుందని, రక్తపు బొట్టు చిందకుండా బీజేపీ మూడు రాష్ట్రాలు ఇచ్చిందని గుర్తు చేశారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుకు సీఎం కేసీఆర్ సహకరించటం లేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మెద్దని ప్రజలను కోరారు.
సావంత్ ఇంటింటి ప్రచారం
జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా ప్రమోద్ సావంత్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. తర్వాత రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ కాలనీ, సోమసుందర్ వీధిఓ ఆయన ప్రచారం నిర్వహించారు.