11న రెండు షిఫ్టుల్లో నిర్వహించ నున్నట్టు ఎన్బీఈఎంఎస్ శుక్రవారం ప్రకటించింది. కటాఫ్ తేదీ, ఇతర వివరాల్ని ఆగస్ట్ 15న వెల్లడిస్తామని పేర్కొంది.
న్యూఢిల్లీ: నీట్ పీజీ – 2024 ఎగ్జామ్ను ఆగస్టు 11న రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇతర వివరాల్ని ఆగస్టు 15న వెల్లడిస్తామని ఎన్బీఈఎంఎస్ పేర్కొంది. నీట్ పీజీ 2024 ఎంట్రెన్స్ ఎగ్జామ్ను జూన్ 23న నిర్వహించాల్సి ఉండగా.. పేపర్ లీకేజీ, ఇతర ఆరోపణల నేపథ్యంలో ఒక రోజు ముందు (జూన్ 22న) కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఎన్బీఈఎంఎస్ పోస్ట్ పోన్ చేసింది.
క్వశ్చన్ పేపర్లు లీక్ అవుతున్నాయనే విమర్శలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. ఎన్బీఈఎంఎస్, టెక్నికల్ పార్టనర్ అయిన టీసీఎస్, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ), సైబర్ సెల్ అధికారులతో పలుమార్లు సమావేశమైంది. నీట్ పీజీ పరీక్ష కోసం అవసరమయ్యే టెక్నికల్ సపోర్ట్ను ఎన్బీఈఎంఎస్తో కలిసి ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ అందించనున్నది. నీట్ పీజీ ఎగ్జామ్ను ఏడేండ్లుగా ఎన్బీఈఎంఎస్ నిర్వహిస్తున్నది. కాగా, నీట్ పీజీ ఎగ్జామ్ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈసారి పరీక్షను ఆన్లైన్లో నిర్వహించబోతున్నారు. ఎగ్జామ్ ప్రారంభానికి కేవలం 2 గంటల ముందు మాత్రమే క్వశ్చన్ పేపర్ తయారు చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం.
మళ్లీ ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం లేదు: కేంద్రం
నీట్ యూజీ – 2024 ఎగ్జామ్ను రద్దు చేస్తే లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లభించలేదని, మళ్లీ పరీక్షను నిర్వహించాల్సిన అవసరంలేదని చెప్పింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పటికే రిజల్ట్స్ అనౌన్స్ చేశామని, ఇప్పుడు ఎగ్జామ్ రద్దు చేస్తే.. హానెస్ట్గా పరీక్ష రాసి మంచి ర్యాంకు పొందిన స్టూడెంట్లు నష్టపోతారని చెప్పింది. 23లక్షల మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాశారని వివరించింది. పారదర్శకంగానే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ నిర్వహణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.
