ముంబై: ఎన్సీపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తోన్న విమానం బుధవారం (జనవరి 28) బారామతి ఎయిర్ స్ట్రిప్లో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గురువారం (జనవరి 29) బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు ముగిసిన గంటల వ్యవధిలోనే అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్తో ఎన్సీపీ కీలక నేతలు భేటీ అయ్యారు. బారామతిలో జరిగిన ఈ సమావేశంలో ఎన్సీపీ సీనియర్ నాయకులు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్బల్, ధనంజయ్ ముండే పాల్గొన్నారు.
అజిత్ పవార్ అకాల మరణంతో ఎన్సీపీ నాయకత్వంపై అనిశ్చితి నెలకొంది. దీంతో ఈ అంశంపై చర్చించేందుకే ఈ భేటీ జరిగినట్లు తెలిసింది. అజిత్ పవార్ హఠాన్మరణంతో బారామతి నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో పోటీ చేయాలని.. అలాగే ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని సునేత్రా పవార్ను కోరినట్లు ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి. అయితే.. ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమని ఛగన్ భుజ్బల్ మీడియాకు తెలిపారు. ఈ భేటీలో ఎటువంటి రాజకీయ చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఎన్సీపీ నాయకత్వ పగ్గాలు ఎవరూ చేపడతారనే చర్చ జోరుగా సాగుతుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
►ALSO READ | నాగాలాండ్ నుంచి మణిపూర్ వైపు దూసుకెళ్లిన కార్చిచ్చు.. జుకో లోయలో 48 గంటలుగా ఆగని మంటలు
కాగా, ప్రస్తుతం రాజ్య సభ సభ్యురాలిగా ఉన్న అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ను బారామతి ఉప ఎన్నికలో బరిలోకి దించాలని ఎన్సీపీ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే, అజిత్ పవార్ స్థానంలో సునేత్రా పవార్ను ఉప ముఖ్యమంత్రిగా ప్రతిపాదించాలని ఎన్సీపీ డిసైడ్ అయినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ఎన్సీపీ సీనియర్ నాయకుడు, మంత్రి నరహరి జిర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ను రాష్ట్ర కేబినెట్లోకి తీసుకోవాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
