- కాంగ్రెస్కు 68, ఇతరులకు 191 సీట్లు
- ఇండియా టుడే–సీవోటర్ ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వేలో వెల్లడి
- తెలంగాణలో బీజేపీకి 6 సీట్లు
- ప్రధాని మోడీ పనితీరుపై 72% మంది సంతృప్తి
- కొవిడ్ నిర్వహణ, ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు
- యూనిఫామ్ సివిల్ కోడ్కు 69% మంది ఓకే
- స్కూళ్లలో హిజాబ్ బ్యాన్ చేయాలన్నోళ్లు 57%
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ‘ఇండియా టుడే–సీవోటర్’ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ద నేషన్’ జనవరి ఎడిషన్ సర్వేలో వెల్లడైంది. లోక్ సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ 284 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని, కాంగ్రెస్ 68 సీట్లకు పరిమితం అవుతుందని, ఇతరులకు 191 సీట్లు వస్తాయని సర్వే వెల్లడించింది. ప్రధాని మోడీ పాపులారిటీ చెక్కుచెదరకుండా అలాగే కొనసాగుతోందని సర్వేలో తేలింది. ప్రధాని మోడీ పనితీరు పట్ల తాజాగా 72% మంది సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడైంది. ఎన్డీఏ ప్రభుత్వం పనితీరు పట్ల 67% మంది సర్వేలో సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం పట్ల 2022 ఆగస్ట్ లో 56 శాతం మందే సంతృప్తి వ్యక్తంచేయగా.. తాజాగా గవర్నమెంట్ అప్రూవల్ రేటింగ్ 11 శాతం పెరిగింది. అలాగే 2022 ఆగస్ట్ లో ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత 37 శాతం ఉండగా, తాజాగా అది18 శాతానికి తగ్గడం విశేషం. దేశవ్యాప్తంగా 1,40,917 మందిపై ఈ సర్వే నిర్వహించారు. వీరికి అదనంగా సీవోటర్ రెగ్యులర్ ట్రాకర్ ద్వారా మరో1,05,008ని ఇంటర్వ్యూ చేసిన ఈ సర్వే ఫలితాలను గురువారం విడుదల చేశారు.
ఎన్డీఏ ఫెయిల్యూర్స్, సక్సెస్ లు ఇవే..
ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయాలేంటీ? అని ప్రశ్నించగా.. కొవిడ్ మేనేజ్మెంట్ అని 20%, ఆర్టికల్ 370 రద్దు అని 14%, అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం అని 12% మంది చెప్పారు. మోడీ సర్కార్ అతిపెద్ద వైఫల్యాల గురించి ప్రశ్నించగా.. ధరల పెరుగుదల అని 25%, నిరుద్యోగం అని 17%, కరోనా మేనేజ్మెంట్ అని 8% మంది బదులిచ్చారు.
యూనిఫామ్ సివిల్ కోడ్ కు 69% ఓకే
యూనిఫామ్ సివిల్ కోడ్ తేవాలని కోరుకుంటున్నారా? అన్న ప్రశ్నకు దాదాపు 69% మంది అవునని అన్నారు. స్కూల్స్ హిజాబ్ బ్యా న్ చేయాల్నా? అంటే.. 57% మంది అవునని చెప్పారు. 26% మంది అవసరంలేదన్నారు.
తెలంగాణలో బీజేపీకి 6 సీట్లు
తెలంగాణలో కూడా బీజేపీ బలం పెరుగుతుందని సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు సీట్లు ఉండగా..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ ఆరు ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని సర్వే తేల్చింది. అదేవిధంగా ప్రధాని మోడీకి ప్రతిపక్షాల కూటమి సవాలుగా మారనుందా? అంటే.. 2022లో 49% మంది అవునని చెప్పగా.. తాజాగా 39% మందే అవునన్నారు.