అభివృద్ధి చెందిన దేశం కావాలంటే ..  ఏటా 7-8 శాతం వృద్ధి అవసరం : రంగరాజన్​

 అభివృద్ధి చెందిన దేశం కావాలంటే ..  ఏటా 7-8 శాతం వృద్ధి అవసరం : రంగరాజన్​

హైదరాబాద్: అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి భారతదేశం ఏటా ఏడు నుంచి ఎనిమిది శాతం వృద్ధి చెందాలని, 2047 నాటికి తలసరి ఆదాయం 13,000 డాలర్లకు చేరాలని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సి రంగరాజన్   తెలిపారు. హైదరాబాద్​లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అసమానతలు లేదా పేదరికాన్ని తగ్గించడానికి ఇన్నోవేషన్లు మాత్రమే పరిష్కారం కావని, సబ్సిడీల వంటి సామాజిక భద్రత చర్యలు, వేగవంతమైన వృద్ధి అవసరమని పేర్కొన్నారు.

 భారతదేశ తలసరి ఆదాయం ఇప్పుడు  2700 డాలర్ల వద్దే ఉందని, ధనిక దేశంగా మారడానికి  ఇది ఐదు రెట్లు పెరగాలని ఆయన  చెప్పారు. ‘‘మారకపు రేటును తక్కువ స్థాయిలో ఉంచినా, ధరలు పెరిగినా నామమాత్రపు ఆదాయం పెరుగుతుంది. అప్పుడు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారవచ్చు. అందువల్ల, భారత ఆర్థిక వ్యవస్థ నిజమైన వృద్ధి ద్రవ్యోల్బణం,  మారకం రేటుపై ఆధారపడి ఉంటుంది”అని రంగరాజన్​ వివరించారు.